Jogulamba Gadwal | అయిజ : జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ పట్టణంలోని పెద్దవాగు సమీపంలో కొత్త బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా 6 పిల్లర్ల కోసం కాంట్రాక్టర్ లోతుగా తవ్వుతున్నారు. పిల్లర్ల కోసం తవ్విన గుంతల్లో వర్షపు నీరు చేరి పక్కనే ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ పిల్లర్లు ఒరిగి 3 పైపులు జాయింట్లు ఊడిపోయాయి. దీంతో నీరు వాగుపాలైంది.
విషయం తెలుసుకున్న మిషన్ భగీరథ అధికారులు నీటి సరఫరా నిలిపి వేశారు. మిషన్ భగీరథ పైప్ లైన్ ఊడిపోవడంతో అలంపూర్ నియోజకవర్గంలోని 7 మండలాల్లోని 84 గ్రామాలు, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీలకు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. వెంటనే స్పందించిన మిషన్ భగీరథ ఎస్ఈ జగన్మోహన్ రావు, ఈఈ భీమేశ్వర్ రావు, డీఈ నాగరాజులు చేరుకుని ఊడిన పైపులైన్ పరిశీలించారు. రెండు ఎంఐ , ఒకటి డీఐ పైపులు ధ్వంసం అయ్యాయని, యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.