హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): సముద్రానికి చెలియలికట్ట ఉన్నట్టే.. దేనికైనా ఓ హద్దు ఉంటుంది. దాన్ని మీరినప్పుడు చట్టం తనపని తాను చేసుకుపోతుంది. చట్టం ఎవరి చుట్టం కాదు.. భావప్రకటనాస్వేచ్ఛ పేరుతో వెకిలివేషాలు వేయటం ఈ మధ్య పరిపాటిగా మారింది. స్థాయీబేధాలు మరిచి సోషల్మీడియాలో వ్యక్తిత్వ హననాలకు తెగిస్తున్న వారిపై కేంద్రంతో సహా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా స్పందిస్తున్నాయి.
తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ‘మోదీ హటావో-దేశ్ బచావో’ నినాదంతో వేలాది పోస్టర్లు వెలిశాయి. దీనిపై ఢిల్లీ పోలీసులు పలు పోలీస్స్టేషన్లలో 100 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరో సంఘటనలో తమిళనాడు ప్రభుత్వ పథకాన్ని కించపరుస్తూ అభ్యంతకరంగా సోషల్ మీడియాలో మీమ్ పోస్ట్ చేశాడో ట్విట్టర్ హ్యాండిల్. దీంతో అక్కడి ప్రభుత్వం అతడిని అరెస్ట్ చేసింది. ఇలాగే కర్ణాటకలో ఓ నటుడు హిందూత్వాన్ని విమర్శిస్తూ వ్యాఖ్య చేశాడు.
అధికారంలో ఉన్న బీజేపీ వెంటనే ఆ నటుడిని అరెస్ట్ చేసింది. కశ్మీర్లో కూడా మానవ హక్కుల ముసుగులో వేర్పాటువాద ఎజెండాను ప్రచారం చేస్తున్నాడన్న ఆరోపణపై ఓ జర్నలిస్ట్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వీటన్నింటి సారం ఒక్కటే.. ఆర్టికల్ 19(1) (ఏ) ప్రకారం రాజ్యాంగం మనకు భావప్రకటనా స్వేచ్ఛను కల్పించింది. దీన్ని ఎవరూ కాదనరు. అయితే ఏదైనా హద్దుల్లో ఉన్నంతవరకే ముద్దు. అంతకుమించి చేస్తామంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు. ఆ మాటకొస్తే తెలంగాణ ప్రభుత్వంపై కూడా ఎంతో మంది సోషల్మీడియా ద్వారా దుష్రచారం చేస్తున్నారు. కానీ రాష్ట్రప్రభుత్వం వాటన్నింటినీ సహనంతో భరిస్తూ వస్తున్నది. కానీ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రప్రభుత్వాలు, చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి సంఘటనల పట్ల కఠినంగానే వ్యవహరిస్తున్నాయి.