Dubbak | సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దుబ్బాక మండలం లచ్చపేటలో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. కులాలు వేరుకావడంతో తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెందిన వాళ్లు ఇంట్లో ఉరివేసుకున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. దుబ్బాకలోని ఓ ప్రైవేటు కళాశాలలో నేహా ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. అదే కాలేజీలో లచ్చపేటకు చెందిన భగీరథ్ సెకండియర్ చదువుతున్నాడు. వీళ్లిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం భగీరథ్కు చెందిన ఓ ఇంట్లో ఇద్దరూ ఒకే తాడుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గుర్తించిన భగీరథ్ కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. మృతదేహాలను దుబ్బాక ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో ఓ లేఖ లభ్యమైనట్లు సమాచారం. కాగా, తమ కులాలు వేరుకావడంతో పెద్దలు తమ ప్రేమను అంగీకరించరని ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెప్పుకుంటున్నారు. దీని గురించి క్లారిటీ రావాల్సి ఉంది.