Nagarkurnool | స్కానింగ్ సెంటర్లోని టాయిలెట్లోనే 16 ఏళ్ల బాలిక ప్రసవించింది. నాగర్కర్నూల్లో సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. కడుపునొప్పితో బాధపడుతున్న బాలిక తన తల్లితో కలిసి సోమవారం నాడు ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ బాలికను పరిశీలించిన వైద్యులు స్కానింగ్ అవసరమని చెప్పడంతో.. ప్రైవేటు స్కానింగ్ సెంటర్కు వెళ్లింది. అక్కడ టాయిలెట్కు వెళ్లిన సమయంలో బాలికకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో బాలిక తల్లి సాయంతో సాధారణ ప్రసవం జరిగింది. పండంటి మగ శిశువుకు బాలిక జన్మనిచ్చింది. అనంతరం ఆ శిశువును చెత్తబుట్టలో వేసేందుకు బాలిక తల్లి ప్రయత్నించింది. ఇది గమనించిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు స్కానింగ్ సెంటర్కు చేరుకుని.. బాలిక, శిశువును నాగర్కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారిని పరీక్షించిన వైద్యులు.. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.