బాన్సువాడ / నిజాంసాగర్, మే 25: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మంజీరాలో స్వల్ప వరద మొదలైంది. మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అడపదడపా వానలకు కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది.
శంకరంపేట్, జోగిపేట్ తదితర ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ఆదివారం ప్రాజెక్టులోకి 436 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదని ప్రాజెక్టు ఏఈఈ శివ ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలకు (1405.00 అడుగులు) గాను ప్రస్తుతం 5.706 టీఎంసీల (1393.26 అడుగులు) నీరు నిల్వ ఉన్నదని పేర్కొన్నారు.