ఇది మోదీ మాట
సింగరేణిని ప్రైవేటీకరణ చేయం. అయినా మా చేతిలో ఏమున్నది? సింగరేణిలో తెలంగాణ రాష్ట్రం వాటా 51 శాతం. కేంద్రానికి ఉన్నది 49 శాతమే. ఏం చేయాలనుకొన్నా రాష్ట్రం చేతిలోనే ఉంటుంది. గత నెల 12న రామగుండం పర్యటన సందర్భంగా ప్రధాని పలుకులు ఇవి.
ఇది కేంద్రం బాట
ఇదే ప్రధాని మోదీ అధ్యక్షతన కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వం సింగరేణి ఉనికి ప్రశ్నార్థకం చేసేలా నిర్ణయాలు తీసుకొంటున్నది. విచక్షణాధికారాలు ఉపయోగించి నామినేషన్ పద్ధతిన ప్రభుత్వ సంస్థయిన సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించవచ్చు. కానీ బహిరంగ వేలం వేస్తూ కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్రకు తెరతీసింది. ఈ నెల 26న 141 బొగ్గు బ్లాకులకు వేలం నిర్వహిస్తున్నది.
హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): నల్ల బంగారంతో తెలంగాణకు విద్యుత్తు వెలుగులు పంచుతున్న సింగరేణిని బొంద పెట్టే కుట్రలకు కేంద్ర ప్రభుత్వం పదను పెట్టింది. ఊహించినట్టుగానే బీజేపీ ప్రభుత్వం కక్షగట్టి సింగరేణి పరిధిలో నాలుగు బొగ్గు బ్లాకులను సంస్థకు కేటాయించకుండా బహిరంగ వేలం వేసేందుకు సిద్ధమైంది. ఆరో రౌండ్ వేలంపాటలో దేశవ్యాప్తంగా 133 బొగ్గు బ్లాకులతోపాటు.. ఐదో విడతలో మిగిలిపోయిన 8 బ్లాకులను కలిపి మొత్తం 141 బ్లాకుల వేలంపై శనివారం బెంగళూరులో పెట్టుబడిదారులతో సమావేశం (ఇన్వెస్టర్స్ కాన్క్లేవ్) నిర్వహిస్తున్నది. ఇప్పటికే ఇండోర్, ముంబైలో కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఇన్వెస్టర్ల కాన్క్లేవ్లను నిర్వహించింది.
సింగరేణికి శరాఘాతం
కొంతకాలం కిందటి వరకు బొగ్గు బ్లాకులను బొగ్గు సంస్థలకు నామినేషన్పై కేంద్రం కేటాయించేది. ఏయే బొగ్గు బ్లాకులు కావాలో ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలు సిఫారసు చేస్తే కేటాయింపులు చేసేది. కార్పొరేట్లకు కట్టబెట్టే ఉద్దేశంతో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. గతంలో బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో భారీగా అవినీతి జరిగిందనే సాకును చూపెడుతూ, కొత్తగా చేసిన చట్టం ప్రకారం బహిరంగ వేలంపాటకు తెరతీసింది. దీంతో ఘనచరిత్ర ఉన్న సింగరేణి సంస్థకు ఇది శరాఘాతంగా మారింది. బొగ్గు బ్లాకులు సాధించేందుకు ప్రైవేటు సంస్థలతో పోటీపడలేని సింగరేణిని నష్టాలబాట పట్టించి దివాలా తీయించటమే కేంద్రం కుట్ర అని కార్మికులు ఆరోపిస్తున్నారు.
సింగరేణి పరిధిలోనే 4 బ్లాకులు
అన్నీ అనుకూలిస్తే డిసెంబర్ 26న నిర్వహించే వేలంపాటలో 141 బ్లాకులను పెట్టగా, ఇందులో సింగరేణి పరిధిలోని పనగడప, సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణపల్లి, కల్యాణిఖని బ్లాక్-6 ఉన్నాయి. ఈ వేలంపాటను ఆన్లైన్లో నిర్వహిస్తుండగా, ప్రైవేటు సంస్థలతోపాటు.. సింగరేణి కూడా పాల్గొనవచ్చని కేంద్రం చెప్తున్నది. ఇందులో పాల్గొనటంపై సింగరేణి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బొగ్గు బ్లాకులను నామినేషన్పై కేటాయించాలని, కొత్త చట్టంలో కేంద్రానికి ఉన్న విచక్షణ అధికారాలను వినియోగించాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతోపాటు సింగరేణి కోరింది. ఈ బ్లాకుల్లో బొగ్గు నిల్వలపై అధ్యయనం చేయడానికి సింగరేణి సుమారు రూ.55 కోట్ల వరకు ఖర్చుచేసింది. భారీగా లాభాలను గడిస్తున్న సింగరేణిని ఎలాగైనా కార్పొరేట్ల పరం చేయాలనే దురాలోచనతోనే కేంద్రం బహిరంగ వేలంపాటకు సిద్ధపడిందని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.