Minister Errabelli | పాలకుర్తి రూరల్, జూన్ 21 : సీఎం కేసీఆర్ పాలనలో ఆలయాలకు పునర్వైభవం దక్కిందని.. రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభతో పరిఢవిల్లుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
అన్ని కులాలు, మతాలు, పండుగలకు సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సర్వమతాలను సమాన గౌరవంతో చూస్తున్నామని అన్నారు. పాస్టర్లకు, ఇమామ్లకు, అర్చకులకు పారితోషికాలను అందజేస్తున్నామని తెలిపారు. ధూపదీప నైవేద్యం కింద గుళ్లకు నిధులు ఇస్తున్నామన్నారు. పురాతన ఆలయాలకు జీవం పోస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని ఆధ్యాత్మిక తెలంగాణగా మారుస్తున్నారని కొనియాడారు. సమైక్య పాలనలో దేవాలయాలు, కవులు, కళాకారులు, పండుగలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించాకే ఆలయాలకు కవులకు కళాకారులకు గుర్తింపు లభించిందన్నారు. పర్యాటక రంగానికి శోభ సంతరించుకుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోనే యాదాద్రి, వేములవాడ, కొమురవెల్లి, ఐలోని, భద్రకాళి, పాలకుర్తి, సన్నూరు వంటి పురాతన, కాకతీయుల కాలం నాటి దేవాలయాలు పునరుద్ధరణకు నోచుకున్నాయని తెలిపారు. నాడు ధూప దీప నైవేద్యానికి నోచుకుని చిన్న చిన్న దేవాలయాలు నేడు పూజలతో కళకళలాడుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పాలకుర్తి, వల్మిడి, బమ్మెర ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నానన్నారు. సీఎం కేసీఆరే బమ్మెరకు స్వయంగా వచ్చి జనగామ జిల్లాకు పర్యాటక రంగానికి రూ.40కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. పాలకుర్తిలో మహాకవి పాల్కూరికి సోమనాథుడు, బమ్మెరలో పోతనమాత్యుడు, వల్మిడిలో వాల్మికీ మహాముని వంటి గొప్ప కవులు జన్మించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. పాలకుర్తి, వల్మిడి, బమ్మెర, చెన్నూరు ప్రాంతాలను రూ.60కోట్లతో పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతున్నామన్నారు. పాలకుర్తిలో హరిత కాకతీయ హోటల్కు రూ.25కోట్లు మంజూరు చేశానన్నారు. 60ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆలయాల్లో జరగని అభివృద్ధి పదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిందన్నారు. పాలకుర్తిలో ఎకరం స్థలంలో రూ.10కోట్లతో సంత్ శ్రీ సేవాలాల్ భవనం, రూ.కోటితో చెన్నూరు త్రికూటాలయం, రూ.13కోట్లతో సన్నూరు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, రూ.4కోట్లతో వానకొండయ్య గుట్టను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.