హైదరాబాద్, మార్చి 30(నమస్తే తెలంగాణ) : రైతుల రెక్కల కష్టం అగ్గిపాలవుతున్నది. పంటలన్నీ ఎండిపోయి పశువులకు మేతగా మారుతున్నాయి. కాల్వల్లో నీళ్లు లేక.. చెరువులు, కుంటలు నోళ్లు తెరుచుకున్నాయి. బోరు బావులన్నీ భోరుమంటున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి.
పంటలకు తడి అందక ఎండిపోయి.. రైతులకు గుండె తడే మిగిలిస్తున్నది. మూడు తడులు పారిస్తే చేతికొస్తదనుకున్న పంటల కోసం రైతులు ట్యాంకర్లతో తిప్పలు పడుతున్నారు. పెట్టుబడిపై కడుపు మండిన రైతన్న పంటకు నిప్పు పెడుతున్నాడు. నిస్సహాయంగా ఉన్న రైతులు పశువులకు మేతగా మార్చుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పాలనలో కష్టాలు ఎక్కిరిస్తుంటే.. ఎక్కి ఎక్కి ఏడ్చిన రైతుల కన్నీళ్లు ఇంకిపోతున్నాయి.
కాంగ్రెస్ కక్షతోనే కరువు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో యాసంగిలో 72 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అయినా.. ఎక్కడా ఎకరం ఎండలేదు. ఎందుకంటే ఎర్రటి ఎండల్లో కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోస్తే.. నడి ఎండకాలంలో చెరువులు, కుంటలు మత్తళ్లు దూకాయి. అప్పుడు భూగర్భ జలాలు పెరిగి భూమికి బరువయ్యేంత పంటలు పండాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించింది. మేడిగడ్డ సాకు చూపి సాగునీళ్లకు ధోకా చేసింది. రైతులను నట్టేట ముంచింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎండిన పంటలే దర్శనమిస్తున్నాయి.
సాగు నీళ్ల కొరతతో ఇప్పటికే 20 లక్షల ఎకరాలు ఎండిపోయినట్లు అంచనాలున్నాయి. వచ్చే నెల రోజుల్లో మరో 5-10 లక్షల ఎకరాలు ఎండిపోయే ప్రమాదం ఉన్నది. మొత్తం మీద దాదాపు 30 లక్షల ఎకరాల వరకు పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఈ యాసంగిలో మొత్తం 67 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఇందులో గరిష్ఠంగా 51 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధికంగా 11 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఇప్పటికే 4 లక్షల ఎకరాలకుపైగా ఎండిపోయినట్లు తెలిసింది. ఇలా ఈ ఒక్క జిల్లానే కాదు.. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపులు, అవగాహన రాహిత్యమే సాగునీటి కొరతకు కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎకరాకు రూ. 25వేల నష్టం….
ఈ యాసంగిలో సాగుకు పెట్టిన పెట్టుబడి నష్టపోయి రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. వరి సాగుకు ఎకరాకు కనీసం రూ. 30 వేల నుంచి 35వేల వరకు పెట్టుబడి అవుతుంది. కోత దశలో ఎండిపోవడంతో కోతలు, ఇతర ఖర్చులు మినహాయిస్తే ఎకరాకు రూ. 25వేల వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రూ. 5వేల కోట్ల నష్టం జరిగిందనే అంచనాలు ఉన్నాయి. ఒక్క సీజన్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీళ్లు ఇవ్వకపోవడం వల్ల రైతులకు ఇంత భారీ స్థాయి నష్టం వాటిల్లిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ నేతలు బిజీ బిజీ
పంటలు ఎండిపోయి రైతులు రందిలో ఉంటే .. కాంగ్రెస్ నేతలు లోక్సభ ఎన్నికలు, టికెట్లు, ఫిరాయింపులు, బుజ్జగింపుల్లో బిజీగా ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఢిల్లీలో నుంచి గల్లీ వరకు చక్కర్లు కొడుతున్నారు. కానీ పుట్టెడు దు:ఖంలో ఉన్న రైతులను పట్టించుకోవడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కనీసం ఎండిన పంట వైపు కన్నెత్తి చూడటం లేదు. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి రైతులపై ఎంతటి ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.
కాంగ్రెసొచ్చింది… కాల్వలెండినయ్
పదేండ్ల నుంచి సల్లగ బతుకుతున్నం. ఈసారి కాంగ్రెసొచ్చింది. కాల్వలు ఎండినయ్. ఎప్పుడు పెట్టినట్టే యాసంగి దినం 8 ఎకరాలు నాటు పెట్టినం. కాల్వల్లో నీళ్లు రాక బోర్లల్ల నీళ్లు లేక ఐదెకరాల పొలం నెర్రెలు పట్టింది. పచ్చగున్న మూడెకరాలు వరుస తళ్లు తిప్పుతున్నంగాని నమ్మకం తక్కువే. ఈ సారి పట్టుబడి మునుగుడే. రూ. 2 లక్షలు అప్పుతెచ్చి మూడు బోర్లేస్తే పడలే. రైతు బంధు వస్తే చేతుల మీద పెట్టుబడి ఎల్లేది. అది రాక పెట్టుబడికి సావుకార్ల దగ్గరికి పోవాల్సివచ్చింది. ముందు తిప్పలే ఉన్నది. ఇగ మంచి నీళ్లన్న ఇస్తరా చూడాలె.
– కున్సోతు జ్యోతి, ధరావత్ తండా, దేవరుప్పుల