Minister Harish Rao | హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలు శాపంలాంటి కాంగ్రెస్ను, పాపం లాంటి బీజేపీని కావాలనుకోవడం లేదని, దీపం లాంటి బీఆర్ఎస్నే మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. ధాన్యం ఉత్పత్తిలోనే కాదు.. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా డాక్టర్ల తయారీలో కూడా తెలంగాణ నంబర్ వన్గా నిలుస్తుందని చెప్పారు. అసెంబ్లీలో వైద్యారోగ్య శాఖపై చర్చ సందర్భంగా శుక్రవారం ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన దీటుగా సమాధానం ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం తీరును, గత తొమ్మిదేండ్లలో తమ పాలనలో సాధించిన అభివృద్ధిని గణాంకాలతో సహా వివరించి ప్రతిపక్ష సభ్యుల వైఖరిని ఎండగట్టారు. వైద్యారోగ్యశాఖపై విపక్ష సభ్యులు చేసిన విమర్శలను తిప్పి కొట్టారు. ఇటీవల సినీ నటుడు రజినీకాంత్ హైదరాబాద్ నగర అభివృద్ధిని ప్రశంసించడాన్ని గుర్తుచేస్తూ.. ‘తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ఇతర రాష్ర్టాల రజనీలకు అర్థమవుతుంటే.. మన రాష్ట్రంలోని గజినీలకు మాత్రం అర్థం కావడం లేదు’ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వచ్చాకనే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచామని చెప్పారు. రూ.పది లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందిస్తున్నదని చెప్పారు. గ్రామ, వార్డు స్థాయిలో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానలు దోస్తీ దవాఖానలుగా మారాయని అన్నారు. రాబోయే ఆరు నెలల నుంచి ఏడాదిలోపు రాష్ట్రంలోని దవాఖానల్లో పడకల సంఖ్య 50 వేలు దాటుతుందని, అప్పుడు కరోనానే కాదు దాని తాతవంటి వ్యాధులొచ్చినా తట్టుకొనే శక్తి తెలంగాణకు వస్తుందని అన్నారు.
‘నాటి కిరణ్కు నేటి కేంద్రానికి తేడాలేదు. అసెంబ్లీలో అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వ ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ముసిముసి నవ్వులు నవ్వుతూ తెలంగాణకు శాపంగా మారారు. కేంద్రం 157 మెడికల్ కాలేజీలను దేశం మొత్తం ఇచ్చి.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వకున్నా పెదవులు మూసుకున్న తెలంగాణ బీజేపీ నాయకులు రాష్ర్టానికి పాపంగా మారారు. దీపం లాంటి కేసీఆర్ ఉండగా శాపం లాంటి కాంగ్రెస్, పాపం లాంటి బీజేపీ మాకు అక్కర్లేదు అని ప్రజలు అనుకుంటున్నారు’ అని హరీశ్రావు వ్యాఖ్యానించారు.
వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్ వంటి అనేక రివల్యూషన్స్ సాధించిన తెలంగాణ నేడు జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా వైట్ కోట్ రివల్యూషన్కు నాంది పలికిందని మంత్రి హరీశరావు పేర్కొన్నారు. ధాన్యం ఉత్పత్తిలోనే కాకుండా నేడు డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నంబర్ వన్ అని చెప్పారు. గతంలో కరువుకాటకాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నుంచి నేడు దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణను సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని అన్నారు. నేడు తెలంగాణలో కోటి పది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం గోదాముల్లో నిల్వ ఉన్నదని, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలు మన రాష్ర్టాన్ని బియ్యం ఇవ్వమని అడుగుతున్నాయని తెలిపారు. బియ్యం ఉత్పత్తిలో మిగులు రాష్ట్రంగా తయారైన విధంగానే డాక్టర్ల ఉత్పత్తిలోనూ సర్ప్లస్ సాధిస్తామని అన్నారు.
వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉండగా, డబుల్ ఇంజిన్ సర్కార్లుగా చెప్పుకొనే ఉత్తరప్రదేశ్ 19, మధ్యప్రదేశ్ 17వ స్థానంలో ఉన్నాయని, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలైన రాజస్థాన్ 16, ఛత్తీస్గఢ్ 10వ స్థానంలో ఉన్నాయని హరీశ్రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ త్వరలో ప్రథమ స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ హయాంలో ఒక్క దవాఖాననైనా నిర్మించలేదని, నిజాంలు, బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన దవాఖానలే కొనసాగాయని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త దవాఖాన నిర్మించిన పాపాన పోలేదన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం రాజీలేకుండా ఖర్చుచేస్తున్నదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖమంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో విద్యాశాఖపై చర్చ సందర్భంగా భట్టి చేసిన ఆరోపణలను మంత్రి హరీశ్ తిప్పి కొట్టారు. గత 9 ఏండ్లలో విద్యారంగానికి ప్రభుత్వం చేసిన వ్యయాన్ని గణాంకాలతో సహా వివరించారు. తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, తాము కేవలం విద్యాశాఖ ద్వారానే ఖర్చు చేయటంలేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, గురుకుల విద్యాలయాలు, మరోవైపు వైద్యవిద్య, వ్యవసాయ విద్య (అగ్రికల్చర్ యూనివర్సిటీ), హార్టికల్చర్ కాలేజీ, ఫారెస్ట్ కాలేజ్, ఫారెస్ట్ యూనివర్సిటీ ఇలా అనేక విధాలుగా విద్యపై ఖర్చుచేస్తున్నామని వివరించారు.
కాంగ్రెస్ హయాంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 1,94,370 మంది విద్యార్థులు ఉంటే తమ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల వారి సంఖ్య 7,44,759కి పెరిగిందని తెలిపారు. రెసిడెన్షియల్ కాలేజీలపై కాంగ్రెస్ రూ. 973 కోట్లు ఖర్చు పెడితే, తాము రూ.4,049 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో జూనియర్ కాలేజీలు 400 మాత్రమే ఉంటే, ఇవ్వాళ తాము కొత్తగా 1,346 జూనియర్ రెసిడెన్షియల్ కాలేజీలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక దశలో భట్టి పాఠశాల విద్యపై చేస్తున్న వ్యాఖ్యలకు మంత్రి వేముల సైతం ఘాటుగానే సమాధానం ఇచ్చారు. అబద్ధం చెప్పటం సరికాదని సూచించారు. ‘మీరు కడితే మేం కూలగొట్టామా?’ అని ప్రశ్నించారు. విద్యాశాఖపై ఏ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ఎంతెంత ఖర్చుచేసిందో మంత్రి హరీశ్రావు వివరించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.