మహబూబాబాద్ : రాష్ట్రంలో దళితులకు మంచి రోజులు వచ్చాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో దళితబంధు లబ్ధిదారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ఆమె దళితబంధు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ..305 కుటుంబాలకు దళితబంధు పథకం కింద యూనిట్లను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు.
ఈ బడ్జెట్ లో ప్రతి నియోజక వర్గానికి 2వేల మందికి ఇవ్వాలని పెట్టుకున్నాం. త్వరలోనే 5,6 వేల మంది లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసిఆర్ అనేక ఆలోచనలు చేసి దళిత బంధు పథకం తెచ్చారన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం, సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలు చేస్తున్నారని ప్రశంసించారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో సీఎం కేసీఆర్ వంటి నేతను ఎక్కడా చూడలేదన్నారు. దళిత బంధు మీద రాజకీయాలు చేశారు. వేరే కులాలను పురి గొల్పారు.
సీఎం కేసీఆర్ దూరదృష్టితో ప్రతి దళిత కుటుంబానికి మూడేళ్లలో 10 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారని మంత్రి తెలిపారు. ప్రతి పక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని, లాభాలనిచ్చే యూనిట్లనే దళితులు తీసుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, శంకర్ నాయక్ ,హరిప్రియ నాయక్, సీతక్క, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్డీవో కొమురయ్య పాల్గొన్నారు.