హైదరాబాద్ : ఈ నెల 22న భారత సంతంత్ర వజ్రోత్సవ వేడుకల ముగింపు వేడుకలను ఎల్బీ స్టేడియంలో జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, వజ్రోత్సవాల కమిటీ చైర్మన్ కే కేశవరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పరిశీలించారు. 22న జరిగే ముగింపు వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరిగే ముగింపు వేడుకలకు అన్నిజిల్లాల నుంచి కనీసం రెండువేలమంది చొప్పున పాల్గొనున్నారు.
కార్యక్రమానికి సంబంధించి స్టేజీ ఏర్పాట్లు, చేపట్టాల్సిన చర్యలు, హాజరయ్యే వారికి కనీస మౌలిక సదుపాయాలు, సీటింగ్, తదితర ఏర్పాట్లను పరిశీలించారు. స్టేడియం మొత్తం కెపాసిటీ 30వేలుగా ఉండగా వీరికి కావాల్సిన సదుపాయాల కల్పనపై సమీక్షించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, అడిషనల్ డీజీ జితేందర్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సమాచార శాఖ ఇన్చార్జి కమిషనర్ జయేష్ రంజన్, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, ఇతర అధికారులు హాజరయ్యారు.
ఈ నెల 16న 11.30 గంటలకు నిర్వహించనున్న సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేయాలని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. సమయంలో ప్రతి రహదారిలో ట్రాఫిక్ నిలిపివేయడం జరుగుతుందని అన్నారు. ప్రతీ కార్యాలయం, ప్రముఖ చారిత్రక ప్రదేశాలు, అన్నింటిలో ఈ సామూహిక జాతీయ గీతాలాపనకు ఏర్పాట్లు చేశామని వివరించారు.