వికారాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉండాలని, పంట నష్టాలను సీఎం కేసీఆర్కు నివేదిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్తో కలిసి పరిశీలించారు. వడగండ్ల వానతో దెబ్బతిన్న మామిడి, ఉల్లిగడ్డ, బొప్పాయి వంటి ఉద్యానవన పంటలతోపాటు మక్కజొన్న పంటల్లో కలియతిరిగారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ మర్పల్లి, మోమిన్పేట్ మండలాల్లోని 13 గ్రామాల్లో వడగండ్ల వర్షం వల్ల 2 వేల ఎకరాల వరకు వ్యవసాయ, ఉద్యానవన పంటలకు నష్టం జరిగిందని పేర్కొన్నారు.
పంట నష్టపోయిన రైతుల దుస్థితిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పంట నష్టానికి సంబంధించి సమగ్ర సమచారాన్ని శనివారం సాయంత్రంలోగా ప్రభుత్వానికి నివేదించాలని కలెక్టర్ను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులకు ధైర్యం కల్పించేందుకు తాము పంటల పరిశీలనకు వచ్చినట్టు తెలిపారు. ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారని, అకాల వర్షాల బారిన పడకుండా యాసంగి పంట అంతకంటే ముందే చేతికొచ్చేలా రైతులు అప్రమత్తం కావాలని సూచించారు.
ఈ విషయంలో రైతులను చైతన్య పరుస్తున్నామని, ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, సూర్యాపేట ప్రాంతాల్లోని రైతులు అనుసరిస్తున్నారని మంత్రి తెలిపారు. మిగతా ప్రాంతాల్లో కూడా ఈ పద్ధతిని పాటిస్తే ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటలను కాపాడుకోగలుగుతామని చెప్పారు. దేశంలోనే అగ్రగామి వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో యాసంగిలో 72 లక్షల ఎకరాల వ్యవసాయ పంటలు, 12 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగులో ఉన్నాయని వివరించారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రైతులకు పెట్టుబడి ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు.
సమగ్ర వ్యవసాయ విధానం అవసరం
దేశమంతటా సమగ్ర వ్యవసాయ విధానం అవసరమని మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించామని, అప్పుడు ఎంపీగా ఉన్న బీ వినోద్కుమార్తో బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్లమెంట్లో చెప్పించామని గుర్తు చేశారు. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేయాలని దేశంలో తొలిసారి డిమాండ్ చేసింది బీఆర్ఎస్ పార్టీనేనని వెల్లడించారు. తాను ప్రధానినైతే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తానని 2014, 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన మోదీ.. రెండు సార్లు గెలిచినా అమలు చేయలేదని పేర్కొన్నారు.
కేంద్రం తెచ్చిన ఫసల్ బీమా పథకంతో రైతులకు వచ్చే దానికంటే ఇన్సూరెన్స్ సంస్థలకు వచ్చే లాభాలే అధికమని వెల్లడించారు. దీనికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలనేది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశమని, కానీ అవగాహనలేని కొందరు బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేయడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి రాష్ట్ర సర్కారు ఫసల్ బీమాతో రూ.400 కోట్లు నష్టపోయిందని వెల్లడించారు. కొన్ని కంపెనీలు లాభపడేందుకు ఇన్సూరెన్స్ చేయాలా? అని ప్రశ్నించారు. మంత్రి వెంట రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం రఘునందన్రావు, ఉద్యానవన శాఖ డైరెక్టర్ హన్మంతరావు, వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.