హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ అప్రమత్తం అవుతూ సహాయ చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మూడు రోజులుగా వరద సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ ప్రాజెక్టు ల ఇన్ఫ్లోను బట్టి ప్రాజెక్టుల పరిధిలోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముంపుగ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ పరిస్థితిని సమీక్షించారు. ఖమ్మం జిల్లాలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ భద్రాచలం కేంద్రంగా సహాయక చర్యల్లో నిమగ్నం అయి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అండగా నిలబడ్డారు. రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్లో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో రాష్ట్రవ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రాష్ట్ర ఆబ్కారీ శాఖమంత్రి శ్రీనివాస్గౌడ్ వరద సహాయక చర్యల్లో తలమునయ్యారు.
రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యల్లో తలమునకలయ్యారు. రాష్ట్ర విద్యత్తుశాఖమంత్రి జగదీశ్రెడ్డి భారీ వర్షాల కారణంగా విద్యుత్తు అంతరాయం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పంచాయతీరాజ్ శాఖపై సమీక్షించి వానలతో ప్రజాజీవితం అతలాకుతలం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురువారం హన్మకొండ జిల్లాలో వరద నష్టం..తీసుకోవాల్సిన చర్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతీ రాథోడ్ మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ విప్ బాల్కసుమన్ పర్యటించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు మొదలుకొని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వారి వారి పరిధిలో వరద సహాయ చర్యల్లో తలమునకలయ్యారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వరదబాధితులకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించటమే కాకుండా వానల వల్ల ప్రబలే వ్యాధుల పట్ల అప్రమత్తం చేస్తూ సహాయక చర్యల్లో నిమగ్నం అయి ప్రజలకు అండగా నిలబడ్డారు.