హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రతిపక్షాలకు చిత్తశుద్ధిలేదని మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు మందలించారు. శనివారం శాసనసభలో మంత్రులు వివిధ సందర్భాల్లో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులకు చురకలు అంటించారు. బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలకు బయట మైకుల్లో మాట్లాడే సమయం ఉంటది.. సభలో మస్తు ప్రశ్నలేసినం అని చెప్పుకుంటరు కానీ, ప్రభుత్వం సమాధానం చెప్తుంటే మాత్రం సభలో ఉండరు.. ఇదీ వాళ్ల చిత్తశుద్ధి’ అని మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పద్దులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వివరణ ఇచ్చే సమయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఉద్దేశించి.. ‘భట్టిగారు.. మీ సభ్యులు అందరూ ఉండటం లేదు. మీవోళ్లందర్నీ సభకు తోల్కరండి’ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు ఎవరూ లేకపోవటాన్ని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పీకర్ దృష్టికి తెచ్చారు. ప్రజల సమస్యల పట్ల ప్రతిపక్షాలకు చిత్తశుద్దిలేదని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ పద్దులపై మంత్రులు సమాధానం చెప్తుంటే, ప్రతిపక్ష సభ్యులు లేకపోవడం బాధాకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో స్పీకర్ సదరు సభ్యులను పిలిచి మాట్లాడాలని సూచించారు.