Palle Pragati | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ): ‘సఫాయన్నా.. మీకు సలామన్నా.. మీతోనే పల్లెలు ప్రగతిని సాధించాయన్నా..’ అని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి ప్రశంసించారు. గ్రామాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధిని ఆచరిస్తుంటే, దేశం అనుసరిస్తున్నదని అన్నారు. తెలంగాణ అభివృద్ధి జెట్ స్పీడ్తో వెళ్తున్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి దినోత్సవం వైభవంగా నిర్వహించారు. బతుకమ్మలు, బోనాలు, కోలాటం ఆడుకుంటూ వేదిక వద్దకు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
గ్రామ పంచాయతీలకు కేటాయించిన ట్రాక్టర్లను కొబ్బరి ఆకులతో అలంకరించారు. పలు గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన పల్లె ప్రగతి దినోత్సవంలో మంత్రులు ఎర్రబెల్లి, జగదీశ్రెడ్డి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. గ్రామ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను రూ.9500కు పెంచిన ఘతన సీఎం కేసీఆర్కే దక్కిందని, అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లను పూర్తిచేసుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఒక్క కార్యదర్శి మూడు నాలుగు గ్రామాలకు సేవలందించేవారని, తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రతి ఊరికి ఒక కార్యదర్శిని ప్రభుత్వం నియమించిందని చెప్పారు.
రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణలో 7.7 శాతం అటవీ సంపదను గ్రీనరీగా తీర్చిదిద్దుకున్నామని మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. యువత కోసం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పల్లె ప్రగతి ద్వారా దోమలను 90 శాతంగా నివారించగలిగామని, అన్ని రంగాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. 60 ఏండ్ల వెనుకబాటు తనాన్ని తరిమికొట్టి, అభివృద్ధి ఫలాలు పంచిన సీఎం దేశంలోనే మరొకరు లేరని కితాబిచ్చారు. మహిళలే గ్రామాల అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్నారని, 11 గ్రామాలకు అవార్డులు వస్తే.. ఇందులు ఏడుగురు మహిళా సర్పంచులేనని పేర్కొన్నారు. అనంతరం ఐఎస్వో పత్రాలు సాధించిన 29 పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులకు మంత్రులు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పలు జిల్లాల జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, సీఎస్ కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు సందీప్కుమార్ సుల్తానియా, హన్మంతరావు, పీసీసీఎఫ్ డోబ్రియాల్, అధికారులు పాల్గొన్నారు.
రేవల్లి: పారిశుద్ధ్య కార్మికుల సేవలను మెచ్చుకుంటూ కాళ్లు కడిగారు ఓ గ్రామ సర్పంచ్. వనపర్తి జిల్లా రేవల్లి మండలం శానాయిపల్లిలో పల్లె ప్రగతి పండుగను పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ లక్ష్మి.. సఫాయి కార్మికుల పాదాలు కడిగారు. వారికి పూలమాలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. గ్రామానికి సఫాయి కార్మికులు చేస్తున్న సేవలను కొనియాడారు.