నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 16: గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో మంత్రులు పర్యటిస్తున్నారు. వరద ధాటికి నష్టపోయిన ప్రాంతాల్లో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎవరూ అధైర్య పడొద్దని.. తాము అండగా ఉంటామని బాధితులకు భరోసానిస్తున్నారు. శనివారం పలువురు మంత్రు లు ఆయా జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి, బాధితులతో మాట్లాడారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వరద సహాయక చర్యల్లో భాగంగా భద్రాచలంలోనే ఉంటున్నారు. ఉగ్రరూపం దాల్చిన గోదావరి తల్లికి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. భద్రాచల రామయ్య దేవస్థానం అర్చకులు, వేద పండితులతో కలిసి గోదావరికి హారతులు సమర్పించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న మంత్రి పువ్వాడను మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు.
గోదావరి వరదతో జరిగిన నష్టంపై ఆయా జిల్లాల్లో ఎమ్మెల్యేలతో కలిసి పలువురు మంత్రు లు అధికారులతో సమీక్షించారు. మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి నష్టంపై సమీక్షించారు. అధికారులు వెంటనే నష్టాన్ని అంచనా వేసి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాలను ఆదుకొంటామని హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్, ఆస్నాద్, లంబాడీపల్లి, జైపూర్ మండలం శివ్వారం, పౌనూర్, వేలాల గ్రామాల్లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పర్యటించి, బాధితులను పరామర్శించారు. ములుగు జడ్పీచైర్మన్ కుసుమ జగదీశ్వర్తో కలిసి వాజేడు, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో గోదావరి వరద కారణంగా దెబ్బతిన్న పంటలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు.
వాజేడు మండలంలోని బీసీకాలనీ, ఏటూరునాగారం మండలం రొయ్యూరులో గోదావరి బ్యాక్ వాటర్తో దెబ్బతిన్న ప్రాంతాలను, ఎస్సీకాలనీలో పర్యటించి బాధితులను పరామర్శించారు. మండలం పుష్కరఘాట్లో ముంపు ప్రాంతాలను పరిశీలించి పునరావాస కేంద్రాలను సందర్శించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని పెగడపల్లి, పలిమెలలోని పునరావాస కేంద్రాలను ఎమ్యెల్యే వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్మిశ్రాతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు. నిజామాబాద్ జిల్లా వన్నెల్ (బీ)లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పర్యటించారు. ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలకు గ్రామానికి చెందిన కర్ణం సాగర్ ఇల్లు కూలిపోగా పరిశీలించారు. బాధితుడితో మాట్లాడి భరోసానిచ్చారు. అటు.. భద్రాచలంలో పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి ఇప్పటికే వరంగల్ డిప్యూటీ కమిషనర్ను ప్రత్యేక అధికారిగా నియమించిన మున్సిపల్శాఖ రాష్ట్రంలోని వివిధ పట్టణాల నుంచి 195 మంది పారిశుద్ధ్య కార్మికులను తరలిస్తున్నది.