హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో వీఆర్ఏ జేఏసీ నేతలతో చర్చలు జరిపింది. వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశిస్తూ సీఎం కేసీఆర్ క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. బుధవారం సీఎస్ శాంతికుమారి చాంబర్లో మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్, జగదీశ్వర్రెడ్డి సమావేశమయ్యారు. ప్రధానంగా పే సేల్, వారసులకు ఉద్యోగాలు, అర్హులకు పదోన్నతులపై చర్చించినట్టు వీఆర్ఏ జేఏసీ నేతలు తెలిపారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, మిషన్ భగీరథ తదితర విభాగాలవారీగా వీఆర్ఏలను సర్దుబాటు చేస్తామని, వారికి ముందుగా ఆప్షన్ ఇస్తామని మంత్రులు తెలిపినట్టు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వారంరోజుల్లో సిబ్బంది కేటాయింపు ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పినట్టు జేఏసీ నేతలు వెల్లడించారు. సమావేశంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్, సీసీఎల్ఏ, నవీన్మిట్టల్, నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి పాల్గొన్నారు. వీఆర్ఏ జేఏసీ తరఫున చైర్మన్ రాజయ్య, కోచైర్మన్ రమేశ్ బహదూర్, సెక్రటరీ జనరల్ దాదేమియా, కో కన్వీనర్లు మాధవ నాయుడు, ఎస్కే రఫీ, వంగూరు రాములు, వెంకటేశ్ యాదవ్ పాల్గొన్నారు.
.