కామారెడ్డి : తెలంగాణ రాష్టం సాధించిన అనంతరం సీఎం కేసీఆర్ నేతృత్వంలో తొమ్మిదేళ్లుగా సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula Prashant reddy) అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల(Decade Celebrations) సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రజా ప్రతినిధులు, అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రభుత్వం సూచించిన క్యాలెండర్ ప్రకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం(Success) చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. జూన్ 2 న పతాకావిష్కరణ, దశాబ్ది ఉత్సవ సందేశం తో ఉత్సవాలు ప్రారంభమై జూన్ 22 అమరవీరుల సంస్మరణ సభ,అమరవీరుల స్తూపం అవిష్కరణతో ముగిస్తున్నట్లు తెలిపారు. 20 రోజుల పాటు ఊరూరా పండుగ వాతావరణంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలన్నారు.
రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మరొక్కసారి గుర్తు చేస్తూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రైతు వేదికల వద్ద ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రైతులతో కలిసి భోజనం చేయాలని అన్నారు. రాష్ట్రం ఏర్పాటు లాగే కామారెడ్డి(Kamareddy District) జిల్లా ఏర్పాటు అనేది ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని, అదే విధంగా నూతన మండలాలు, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత దగ్గరైందని అన్నారు. కొత్త జిల్లాగా ఏర్పాటు అయిన కామారెడ్డి జిల్లా కేంద్రంలో సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కోసం జరుగుతున్న కృషిని, మన ఊరు- మన బడి కింద పాఠశాలల్లో వచ్చిన మార్పును నాడు-నేడు ఫొటోలతో ప్రదర్శించాలని పేర్కొన్నారు. కామారెడ్డికి మెడికల్ కాలేజ్(Nursing College), బాన్స్వాడలో నర్సింగ్ కళాశాల(Nursing College), వివిధ చోట్ల వచ్చిన ప్రభుత్వ డిగ్రీ, ఇతర కళాశాలలు, గురుకుల, సంక్షేమ ఇతర పాఠశాలల వివరాలు తెలియజేయాలన్నారు.
ఆధునికతతో ఉపాధి కోల్పోయిన కుల వృత్తుల వారికి అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు(Cheif Minister KCR) నిర్ణయించారని తెలియజేశారు. ఈ మేరకు పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేసి దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ శోభ, ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు సురేందర్, హనుమంత్ షిండే, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.