నిజామాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఊరూరా మద్దతు లభిస్తున్నది. ప్రజలు, కుల సంఘాల వారు సమావేశమై మరోమారు వేములను గెలిపించుకుంటామంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన వేములకు బాసటగా నిలబడతామని ప్రకటిస్తున్నారు. సంక్షేమ పథకాలు సైతం అందుతున్నాయని, ఇంతమంచి ప్రభుత్వాన్ని ఇప్పటిదాక తామెప్పుడూ చూడలేదని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. రోడ్లు, కరెంటు, సాగు, తాగు నీళ్లే గాకుండా రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్, కేసీఆర్ కిట్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు తమ గడపకు చేరాయని, ఇలాంటి సంక్షేమ సర్కారును వదులుకోలేమని వారు స్పష్టం చేస్తున్నారు. మంత్రి వేములను మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమని తాము నమ్ముతున్నామని, అందుకే ఈ సారి కూడా కారు గుర్తుకు ఓటేసీ బీఆర్ఎస్ను గెలిపించుకుంటామని వారు స్పష్టం చేస్తున్నారు. కాగా నియోజకవర్గంలో ఇప్పటివరకు 54 గ్రామాల్లో ఇలాంటి తీర్మానాలు చేసి వాటి ప్రతులను మంత్రి వేములతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులకు అందజేశారు. ఇలా ఏకగ్రీవాల జోరుతో బాల్కొండ నియోజకవర్గం ఏకంగా రాష్ట్రంలోనే ముందంజలో కొనసాగుతున్నది. మొదట కామారెడ్డిలో ప్రారంభమైన ఈ ట్రెండ్ కాస్త బాల్కొండ నియోజకవర్గం అంతటా వ్యాపించింది. ఏకగ్రీవాల జోరు కనిపిస్తుండటంతో గులాబీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ, ముప్కాల్, మెండోరా, కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల, భీమ్గల్, వేల్పూర్ మండలాల్లో మొత్తం 110 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాదాపు సగం గ్రామాల్లో మంత్రికి అనుకూలంగా తీర్మానాలు చేశారు.
తీర్మానాలు ఇలా..
నియోజక వర్గంలోని 8 మండలాలు ఉండగా 53 గ్రామాల్లో, 164 కుల సంఘాలు, 6,828 కుటుంబాల వారు వేములకు ఏకగ్రీవ మద్దతు తీర్మానాలు చేశారు. భీమ్గల్ మండలంలో మొత్తం 27 గ్రామాలు, ఒక మున్సిపాలిటీ ఉన్నది. ఇందులో 11 గ్రామాలు, ఒక మున్సిపాలిటీలో 46 కుల సంఘాలు వేములకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. కమ్మర్పల్లి మండలంలోని 5 గ్రామాల్లో 6 కుల సంఘాలు 245 కుటుంబాలు, బాల్కొండ మండలంలోని 6 గ్రామాల్లో 13 సంఘాలు 577 కుటుంబాలు, ముప్కాల్ మండలంలోని 2 గ్రామాల్లో 2 కుల సంఘాలు 103 కుటుంబాలు, మోర్తాడ్ మండలంలోని 7 గ్రామాల్లో 29 సంఘాలు, 948 కుటుంబాలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశాయి. వేల్పూర్ మండలంలోని 12 గ్రామాల నుంచి 36 కుల సంఘాలు, 1,034 కుటుంబాలు, మెండోరా మండలంలోని 3 గ్రామాల నుంచి 15 కుల సంఘాలకు చెందిన 452 కుటుంబాలు, ఏర్గట్ల మండలంలోని 5 గ్రామాల నుంచి 17 కుల సంఘాలకు చెందిన 691 కుటుంబాలు తీర్మానాలు అందజేశాయి. ఇదిలావుండగా రోజురోజుకూ ఏకగ్రీవాల ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నది.
ఆదుకున్నోళ్లను మరువం
మత్స్యకారులంటే మునుపు ఎవ్వరు పట్టించుకునేది కాదు. మమ్ములను గుర్తించింది కేసీఆర్ సారే. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మాకు భరోసా దొరుకుతున్నది. మత్స్యకారులను ఆదుకున్న బీఆర్ఎస్కే మా మద్దతు. ప్రశాంత్రెడ్డి ఎమ్మెల్యే అయినంక మాకు అనేక సౌకర్యాలు కల్పించిండు. మమ్మల్ని ఆదుకున్నడు.
– ఎర్రోళ్ల గంగాధర్, మత్స్యకారుడు, బాచన్పల్లి
ప్రశాంత్రెడ్డికే సంపూర్ణ మద్దతు
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికే మా సంపూర్ణ మద్దతు. ఎవరెన్ని జెప్పినా మేము మాత్రం ఆయనకే సపోర్ట్ చేస్తాం. వచ్చే ఎన్నికల్లో వేములను అందరి కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించుకుంటం. నాకు తెల్సీ ఇప్పటివరకు గింతగానం డెవలప్మెంట్ ఎవ్వరూ సెయ్యలేదు. గింత అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తుంటే వేరేవాళ్లను ఎన్నుకుంటమా?
– చిట్యాల రమేశ్, బీడీ కమీషన్ ఏజెంట్, మెండోరా