వేల్పూరు : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో లాక్డౌన్ పక్కా అమలయ్యేలా చూడాలి అని అధికారులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజల్లో కోవిడ్పై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో విస్తరించిన మహమ్మారి ప్రజల స్వీయ నియంత్రణతో తగ్గుముఖం పడుతున్నా..ఇంకా అప్రమత్తంగానే ఉండాలి అని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో కోవిడ్ పరిస్థితులపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం ఉదయం పోలీస్,రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గంలోని గ్రామాలు, మండల కేంద్రాల్లో ప్రజలు స్వచ్ఛంద లాక్ డౌన్ పెట్టుకోవడం వల్ల కరోనా వ్యాప్తి చైన్ బ్రేక్ చేసినట్లైందని అన్నారు. ఒకరినుండి ఒకరికి వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారన్నారు.
పోలీస్ యంత్రాంగం లాక్ డౌన్ పక్కా అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. అన్ని మండల కేంద్రాలతో పాటు, గ్రామాల్లో నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నాలుగు గంటల పాటు సడలింపు ఉన్న నేపథ్యంలో ఆ సమయంలోనే రైతులు కూడా వారికి అవసరమైన ఫెస్టిసైడ్స్, విత్తనాలు,వ్యవసాయ పనిముట్లు తీసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. వ్యవసాయ రంగానికి మినహాయింపు ఉన్నప్పటికీ ఆయా షాపుల వారిని కూడా లాక్ డౌన్ సడలింపు సమయంలోనే తీసేలా ప్రోత్సహిస్తే వైరస్ వ్యాప్తి కట్టడి ఇంకా సులువు అవుతుందని అన్నారు.ఈ సందర్భంగా రైతులు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అన్నం పెట్టే రైతు ఆరోగ్యం కూడా కేసీఆర్ ప్రభుత్వానికి ముఖ్యమే అని అన్నారు.
ప్రజల్లో కోవిడ్ పై ఇంకా కొద్దిగా అపోహలు ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు వారికి అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని రెవెన్యూశాఖ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో విస్తరించిన మహమ్మారి ప్రజల స్వీయ నియంత్రణతో తగ్గుముఖం పడుతున్నా.. ఇంకా అప్రమత్తంగానే ఉండాలని చెప్పారు. కోవిడ్ నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలని రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాస్, డిఎస్పీ రఘు, సిఐ విజయ్, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.