నిజామాబాద్: జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. భారీ వర్షాలతో పలు చెరువులకు
గండ్లు పడ్డాయి. రాళ్లవాగు, తీగల వాగు, కప్పల వాగు, పూలాంగ్ వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో
పలు చోట్ల రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో వరి, సోయా, కంది,
మొక్కజొన్న, శనగ పంటలు నీట మునిగాయి. మంజీర నదికి వరద పోటెత్తడంతో తెలంగాణ- మహారాష్ట్ర
మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్సారెస్పీకి భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతున్నది. జిల్లాలో అత్యధికంగా మెండోరాలో 23.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.
భారీ వర్షాలకు జిల్లాలోని 1067 చెరువులు నిండుకుండలా ఉన్నాయి. వరద ఉధృతికి 14 చెరువులు
తెగిపోయాయి. రెంజల్ మండలం కందుకుర్తి వద్ద వరద పోటెత్తింది. బ్రిడ్జిపైనుంచి గోదావరి వరద
ప్రవహిస్తున్నది. దీంతో మహారాష్ట్ర-నిజామాబాద్కు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సాలూర వద్ద
మంజీరాకు పెద్దఎత్తున వరద రావడంతో పాత బ్రిడ్జి మునిగిపోయింది. దీంతో మహారాష్ట్ర-బోధన్ మధ్య
వాహనాలు ఆగిపోయాయి.
నిజామాబాద్-ఆర్మూర్ శివారులోని ధోబిఘాట్ వద్ద వరద భారీగా ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు
జాతీయ రహదారి 63ని తాత్కాలిక మూసివేశారు. నవీపేట మండలంలోని అల్జాపూర్ గ్రామం
జలదిగ్బంధంలో చిక్కుకుంది. గోదావరి బ్యాక్వాటర్తో అల్జాపూర్-యంచ రోడ్డు నీటమునిగింది. దీంతో
అత్యవసర సేవలు నిలిచిపోయాయి.
నిజామాబాద్ జిల్లాలో వర్షాలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, మేయర్,
కమిషనర్, జడ్పీ చైర్మన్, అదనపు కలెక్టర్, నుడా చైర్మన్తో చర్చించారు. ముంపు ప్రాంతాలు, పునరావాస
కేంద్రాల్లో చర్యలపై ఆరాతీశారు.