నిజామాబాద్ : జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంని, ప్రమాదాలు సంభవిస్తే వెంటనే స్పందించి నష్టాన్ని నివారించేందుకు వీలవుతుందని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula )అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన అగ్నిమాపక కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ వర్చువల్గా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో అద్వితీయమైన అభివృద్ది జరిగిందన్నారు.ఫైర్ స్టేషన్ వాళ్లు ఏర్పాటు చేసిన బుక్లో సందేశం రాయమంటే..‘ఫైర్ స్టేషన్ అవసరం రావొద్దు..ఒకవేళ వస్తే అత్యంత మెరుగైన సేవలు అందించాలని’ రాసినట్టు తెలిపారు.
ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే 20 సబ్ స్టేషన్లు,1000 వెయ్యి కోట్లతో రోడ్లు, బ్రిడ్జిలు, గోదాములు రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా నిర్మించుకున్నామని తెలిపారు. జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఆలోచన చేయాలని, బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫైర్ సేఫ్టీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.