మోర్తాడ్/ఖలీల్వాడి, ఆగస్టు 22: దేశంలో అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని, ఇదంతా ప్రధాని మోదీ పుణ్యమేనని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో యువతకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో మోదీ అధికారంలోకి రాకముందు సిలిండర్ ధర రూ.400 ఉంటే ఇప్పుడు రూ.1,200కు చేరిందని, పెట్రోల్, డీజిల్ ధరలు రెండింతలయ్యాయని విమర్శించారు. ధరల పెరుగుదల కారణంగా సామాన్యుడిపై అదనపు ఆర్థిక భారం పడుతున్నదని చెప్పారు. క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదన్నారు.
కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు. పదేండ్ల క్రితం తెలంగాణ ఎట్టున్నదో.. ఇప్పుడు ఏ విధంగా మారిందో యువత ఆలోచించాలని కోరారు. తెలంగాణ వచ్చాక.. 24 గంటల విద్యుత్తు సరఫరా, సువిశాలమైన రోడ్లు, గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణంతో అనతికాలంలోనే తెలంగాణ ఊహించని విధంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. అభివృద్ధి చేస్తున్నదెవరు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నదెవరు అనేది యువకులు ఆలోచించాలని సూచించారు. వాహనాలు నడిపే యువత ఇబ్బందులు పడొద్దని ఉచితంగా లైసెన్స్లు ఇప్పిస్తున్నామని మంత్రి వేముల పేర్కొన్నారు. అలాగే.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్నగర్లో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజా బహదూర్ వెంకటరామారెడ్డి కాంస్య విగ్రహాన్ని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తాతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.