బాల్కొండ, నవంబర్ 26: 24 గంటల కరెంట్ ఇస్తున్న తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు అర్రాస్ పాట లెక్క కరెంట్ గంటలను తగ్గిస్తూ మాట్లాడుతున్నారని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్తో పోటీ పడ్డట్టు 3 గంటల కరెంటే అంటున్నాడని గుర్తు చేశారు. మొత్తానికి 24 గంటల కరెంట్ను పోటీ పడి ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ కర్ణాటక, తెలంగాణ అధిష్ఠానం కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీ సురేశ్రెడ్డితో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రుణమాఫీని ఆపింది కాంగ్రెస్ పార్టీయే అని.. ఈ పథకాన్ని మహా అంటే మూడో తేదీ వరకు ఆపుతారని, ఆ తర్వాత రుణమాఫీ వర్తింపు తిరిగి ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఎస్సారెస్పీ పునర్జీవం పథకంతో వరద కాలువలు నింపామని, కొత్త సబ్స్టేషన్ నిర్మించడంతో బోదేపల్లిలో ఎంతో మంది రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. పునర్జీవంతో పోచంపాడ్లో నీటికి ఢోకా లేదని స్పష్టం చేశారు. చిట్టాపూర్లో ప్రజలు అడిగినవి, అడగనివి అన్నీ చేసి పెట్టానని, తనను మరోసారి ఆశీర్వదించాలని, మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు.