భీమ్గల్, నవంబర్ 19 : కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణను ఢిల్లీకి, బీజేపీకి అధికారమిస్తే గుజరాత్కు అప్పగిస్తారని రోడ్లు భవనాల శాఖ మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి మాట్లాడుతూ.. మళ్లీ పాత రోజులు తెచ్చేందుకు కొన్ని పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు.
బీజేపీ అధికారంలోకి వస్తే తానే సీఎం అని చెప్పుకుంటున్న కిషన్రెడ్డి నాడు తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేయమంటే పారిపోయాడని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చంద్రబాబు శిష్యుడని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 11 రోజులు అన్నం తినలేదన్న పవన్ కల్యాణ్.. బీజేపీ సహకారంతో తెలంగాణలో అడుగు పెట్టిండని విమర్శించారు.
తెలంగాణ పచ్చగా మారి ఇక్కడి ప్రజలంతా బాగు పడుతున్న సందర్భాన్ని కొన్ని శక్తులు చూడలేకపోతున్నాయని మండిపడ్డారు. వరి సాగులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని అన్నారు. తెలంగాణ కేసీఆర్ చేతుల్లోనే పదిలంగా ఉంటుందని, మరింత అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని వేముల కోరారు.