కమ్మర్పల్లి. ఏప్రిల్ 25: ‘దేశంలో రైతు సర్కారు రావాలని సీఎం కేసీఆర్ అం టుంటే.. ప్రధాని కుర్చీ ఖాళీగా లేదని అమిత్షా అంటుండు.. ప్రధాని కుర్చీ ఏమైనా మీ అబ్బ జాగీరా? రైతుబిడ్డ ప్రధాని కాకూడదా?’ అని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. అబ్ కి బార్.. కిసాన్ సర్కార్ అని కేసీఆర్ నినదిస్తుంటే, కుర్చీ ఖాళీగా లేదని మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో మంగళవారం నిర్వహించిన బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో మంత్రి వేముల మాట్లాడుతూ.. కేసీఆర్ చెప్తున్న మాటలను దేశమంతా సానుకూలంగా ఆలోచిస్తుంటే, అమిత్షా ప్రధాని కుర్చీ గురించి మాట్లాడమేమిటని నిలదీశారు.
దేశానికి రైతు సర్కార్ కావాలని కోరుకునే కేసీఆర్.. ప్రధాని ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. అదానీ, అంబానీల బ్రోకర్లు ప్రధాని అయితే లేని తప్పు.. దేశంలో రైతు శ్రేయస్సు కోరే కేసీఆర్ ప్రధాని అయితే తప్పా? అని ప్రశ్నించారు. ప్రధానిగా అన్ని అర్హతలు ఉన్న నాయకుడు కేసీఆర్ అని స్పష్టంచేశారు. ‘ఎన్నికల్లో ప్రజలు హేమాహేమీలనే అవతల విసిరి పారేశారు. నరేంద్రమోదీ ఓ లెక్కనా? మీ కండ కావరం, అహంకారాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ బయలుదేరడంతో ఢిల్లీ పీఠం కదులుతున్నది’ అని పేర్కొన్నారు. మోదీ, అమిత్షాకు కేసీఆర్ భయం పట్టుకున్నదని ఎద్దేవా చేశారు. దేశంలో బీఆర్ఎస్ ప్రభంజనం మొదలైందని, మహారాష్ట్రలో రైతులోకం కేసీఆర్ కోసం కదిలిందని చెప్పారు. మోదీ అవినీతిని ప్రశ్నిస్తున్న కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే ఆయన కూతురు కవితను వేధిస్తున్నారని దుయ్యబట్టారు. టైగర్ కేసీఆర్, టైగర్ బిడ్డ కవిత భయపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. సమావేశంలో ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.