Minister Prashanth Reddy | మోర్తాడ్, అక్టోబర్ 20: రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి వచ్చారని, ఆయనది వారసత్వ రాజకీయం కాదా? అని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. తాత జవహర్లాల్ నెహ్రూ, నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్గాంధీ, తల్లి సోనియాగాంధీల పేరు చెప్పుకుంటూ రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్ గాంధీ.. కేసీఆర్ది కుటుంబపాలన అని మాట్లా డటం ఎంతవరకు వాస్తవమో తెలపాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చిన్న విషయాన్ని కూడా గమనించలేని రాహుల్ను పప్పు అనడంలో తప్పేమి లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ది జాతీయ పార్టీ అయితే రాష్ర్టానికో విధానం, రాష్ర్టానికో మ్యానిఫెస్టో ఉంటదా అని శుక్రవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. రాష్ర్టానికో మ్యానిఫెస్టో ప్రకటించి మోసపూరిత వైఖరిని ఇక్కడే బయటపెట్టుకుంటున్నారని విమర్శించారు.
కాంగ్రెస్వి నెత్తి, కత్తిలేని మాటలని ధ్వజమెత్తారు. ముందు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రూ.4 వేల పింఛన్ ఇచ్చి, తెలంగాణలోనూ ఇస్తామని చెబితే ప్రజలు నమ్ముతారని, అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఏమీ చేయకుండా తెలంగాణలో ఇస్తామని చెబితే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. అవినీతి గురించి కాంగ్రెస్ పార్టీ, రాహుల్గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని మంత్రి పేర్కొన్నారు. ఈ భూమి మీద కాంగ్రెస్ చేయని స్కాం ఏదైనా ఉంటే ఒక్కటి చెప్పాలని, కాంగ్రెస్ అంటేనే అవినీతి, కుంభకోణాలని ఎద్దేవా చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో 60 ఏండ్ల కాంగ్రెస్ పాపాలను కడిగామని మంత్రి తెలిపారు. రూ.80 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తే, లక్ష కోట్ల అవినీతి ఎట్ల జరిగిందో రాహుల్గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు.