Minister Prashanth Reddy | ప్రధాని నరేంద్ర మోదీ ఓ అబద్ధాల కోరు అంటూ మంత్రి ప్రశాంత్రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. సీఎం కేసీఆర్పై మోదీ నిరాధార ఆరోపణలు చేయడం దుర్మార్గమని, ప్రధాని స్థాయి వ్యక్తి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలు మాట్లాడడం హేయమన్నారు. కేసీఆర్ ఎన్డీయేలో కులస్తానని చెప్పడం అబద్ధమని.. ఎన్డీయేలో కలవమని బతిమిలాడితే దేశాన్ని అమ్మేవారితో కలమని కేసీఆర్ ఖరాఖండిగా చెప్పారన్నారు. ఎన్నికల వేళ అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రధాని.. దర్యాప్తు సంస్థలన్నీ జేబులోనే ఉన్నాయి కదా..? ఇన్ని రోజులు ఏం చేశారని ప్రశ్నించారు.
కేసీఆర్పై ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడైన మోదీ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని. అదానీకి బినామీ మోదీ అన్నారు. దేశ సంపదను తనమిత్రుడైన అదానీకి దోచి పెడుతున్నాడని విమర్శించారు. హిండెన్బర్గ్ అలాంటి అంతర్జాతీయ సంస్థలు మోదీ అవినీతి చిట్టాను బయటపెట్టాయని.. తన కార్పోరేట్ మిత్రులకు రూ.12లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేసి.. అక్రమ డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అంటేనే నరనరాన విషం నింపుకున్న మోదీ.. తెలంగాణ కోసం చేసింది శూన్యమన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలలు, ఐటీఐఆర్, ఐఐటీలు ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదని, తెలంగాణ అభివృద్ధి బద్ద వ్యతిరేకి మోదీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజామాబాద్లో హెలికాప్టర్ దిగిన మోదీ.. కేసీఆర్ కట్టిన కలెక్టరేట్, కేటీఆర్ కట్టిన ఐటీ టవర్ చూసి కన్నుకుట్టిందని అందుకే ఏవో కహానీలు చెప్పి మరోసారి అబద్ధాల కోరు అని మరోసారి నిరూపించకున్నాడన్నారు. కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలంటే నీ సహాయం ఎందుకు అని ప్రశ్నించారు. వంద మంది ఎమ్మెల్యేల బలం ఉందని.. మోదీ బలం ఎంత అంటూ నిలదీశారు. కేసీఆర్కు ఉన్న బలంతో కేటీఆర్ను సీఎం చేయొచ్చని.. మోదీ బోడి సహాయం ఎవడికి కావాలంటూ విమర్శించారు. కేసీఆర్ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం మోదీ గుండెల్లో దడ పుట్టిస్తుందని, అందుకే కేసీఆర్పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఎన్ని కుట్రలు పన్నినా బీఆర్ఎస్ గెలుపును ఆపలేరన్నారు.