కమ్మర్పల్లి, సెప్టెంబర్ 17 : హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ సభ తుక్కు హామీల మీటింగ్గా మారిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ టూరిస్టుల సభ పచ్చి అబద్ధాలకు, అమలుకు నోచుకోని హామీలకు వేదికైందని పేర్కొన్నారు. తుక్కుగూడలో సభ పరిణామాలపై ఆయన ఓ ప్రకటనలో తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను మభ్య పెట్టే హామీలను సీడబ్ల్యూసీ మీటింగ్లో ప్రకటించారని ధ్వజమెత్తారు. చంద మామాను ఒళ్లో తెచ్చి పెడతామన్న విధంగా హామీలు ఇచ్చారని ఎండగట్టారు. చెవులకు విన సొంపుగా తుక్కు హామీలు ఇచ్చారని ఎద్దేవా చేశారు.
అవి హామీల్లా కాకుండా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో పోటీ పడే అర్రాసు పాటల మాదిరిగా ఉన్నట్టు ఆయన దుయ్యబట్టారు. నిన్నగాక మొన్న ఇవే మోసపు హామీలతో కర్ణాటకలో గద్దెనెక్కిన కాంగ్రెస్.. అక్కడి ప్రజలకు కనీసం రేషన్ కూడా ఇవ్వడం లేదని తెలిపారు. కర్ణాటకలో అడ్డగోలుగా చార్జీలు పెంచిందని, అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 50 శాతం కమీషన్ సర్కారుగా ముద్ర వేసుకున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో సిలిండర్ను రూ.500కు, రూ.4 వేల పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తన మనుగడకే గ్యారెంటీ లేని కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల పేరిట హామీలు ఇవ్వడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ చేతుల్లో పదిలంగా, సుభిక్షంగా ఉన్న రాష్ర్టాన్ని.. ప్రజలు అవినీతి కాంగ్రెస్ చేతుల్లో పెట్టరని ఆయన తెలిపారు. కేసీఆర్ సైతం రాష్ర్టాన్ని గుంట నక్కల పాలు కానివ్వరని.. తన ప్రాణాలను అడ్డు వేసైనా తెలంగాణను కాపాడుకుంటారని స్పష్టం చేశారు.