కమ్మర్పల్లి/వేల్పూర్, ఆగస్టు 13: తెలంగాణ అంతా ఒక కుటుంబమని, ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తండ్రి లాంటివారని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు. ఇంటికి ఏమి కావాల్నో ఇంటి పెద్దకు మాత్రమే తెలుసని, తెలంగాణకు ఏమి కావాలో కేసీఆర్కు మాత్రమే తెలుసని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశం ముందు సగర్వంగా నిలబెట్టారని ప్రశంసించారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోనాపూర్, అమీర్నగర్లో దాదాపు రూ.30 కోట్ల అభివృద్ధి పనులనుమంత్రి ప్రారంభించారు. కోనాపూర్ సభలో మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ రాక ముందు రాష్ట్రం ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లున్నదో రైతన్నలు ఆలోచించాలని, గుండె మీద చేయి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. పైసలకు ఇబ్బంది ఉన్నా ఏకకాలంలో రూ.19 వేల కోట్ల రైతు రుణమాఫీ నిర్ణయం తీసుకొని రైతులపై తనకున్న ప్రేమను మరోసారి చాటారని చెప్పారు. ఎన్నికలు రాగానే కొందరు ఊర్ల మీద పడుతారని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతును అరి గోసపెట్టిన కాంగ్రెసోళ్లు రైతు ధర్నా చేయడం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మితే మరోసారి గోస పడతామని, పాత రోజులే పునరావృతం అవుతాయని హెచ్చరించారు.
అర్వింద్ మోసపూరిత మాటలు
ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి ఐదేండ్లు కావస్తున్నా బోర్డు తేలేకపోయిన ఎంపీ అర్వింద్ చివరకు బోడిగుండు చూపెట్టాడని మంత్రి వేముల దుయ్యబట్టారు. కమ్మర్పల్లి మండలం కోనాపూర్లో దివంగత రైతు నేత వేముల సురేందర్రెడ్డి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. కమ్మర్పల్లి మండలం మానాలకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 100 మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలు వేల్పూర్లో బీఆర్ఎస్లో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.