కమ్మర్పల్లి, ఆగస్టు 6 : దుష్ట బీజేపీ పన్నాగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కేంద్రంతోపాటు కోనాసముందర్ గ్రామంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ రాజేశ్వర్రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి వేముల మాట్లాడుతూ.. బీజేపీ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ వికృత క్రీడ కొనసాగుతున్నదన్నారు. ఆఖరుకు శ్మశానవాటికపైనా జీఎస్టీ వేసిన బీజేపీ లాంటి పార్టీ ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. అభివృద్ధి కోసం రూపాయి తేనోడికే మాటలెక్కువ అని ఎద్దేవా చేశారు.
అమ్మ మీద ఒట్టు.. వారివన్నీ అబద్ధాలే
కేంద్రంలోని బీజేపీ సర్కారు, ఆ పార్టీ నాయకులు పచ్చి అబద్ధాలతో రాజకీయం చేస్తున్నారని మంత్రి వేముల ఆరోపించారు. కేంద్రం, బీజేపీ సాగిస్తున్న అబద్ధాలు, అవాస్తవాలను ప్రజలకు వివరించారు. ‘మా అమ్మ మీద.. దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నా.. నేను చెప్పేవన్నీ ముమ్మాటికీ వాస్తవం.. నాకు అబద్ధాలు మాట్లాడే అలవాటు లేదు’ అంటూ ఆవేశంగా మాట్లాడుతూ.. ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు..
రాష్ట్రంలో కొత్తగా పది లక్షల పింఛన్లను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించిన సీఎం కేసీఆర్కు మంత్రి వేముల ధన్యవాదాలు తెలిపారు. డయాలసిస్ పేషెంట్లకు కొత్తగా రూ.2,016 పింఛన్ ప్రకటించడం కేసీఆర్ మానవీయ పాలనకు నిదర్శనమన్నారు.
టీఆర్ఎస్లో చేరికల జాతర
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 6: దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ స్థాయిలో తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్లో చేరేందుకు వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు క్యూ కడుతున్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోనాసముందర్లో అమీర్నగర్, కోనాసముందర్ వడ్డెర కాలనీకి చెందిన 150 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలానికి చెందిన 30 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఎమ్మెల్యే సైదిరెడ్డి సమక్షంలో మఠంపల్లి మండలం పెదవీడుకు చెందిన హుజూర్నగర్ బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి సాముల వెంకటేశ్వర్రెడ్డితోపాటు 30 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో పెద్దకొండూరుకు చెందిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు 50 మంది మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో కారెక్కారు.