భీమ్గల్, నవంబర్ 6: బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం మనస్సుపెట్టి పని చేశానని, మరోసారి ఆశీర్వదించాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో నామినేషన్ వేశారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి, ఫ్యామిలీ అండ్ హెల్త్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎల్ఎంబీ రాజేశ్వర్తోపాటు సతీమణి నీరజతో కలిసి రిటర్నింగ్ అధికారి చిత్రమిశ్రాకు నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకు ముందు లింబాద్రిగుట్టపై శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేముల ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా భీమ్గల్కు చేరుకున్నారు. నామినేషన్ వేసిన అనంతరం వేముల వారినుద్దేశించి మాట్లాడారు. ప్రజల కోసం నిబద్ధతతో పనిచేస్తే వారే కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారని తాను విశ్వసిస్తానని చెప్పారు. తనను ఆశీర్వదించడానికి వేల సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులే ఇందుకు నిదర్శనమని తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, సాగునీటి రంగంలో విజయాలను సాధ్యం చేసినప్పుడు తనకు కలిగి ఆనందాన్ని వర్ణించలేనిదని ఉద్వేగంగా చెప్పారు. సీఎం కేసీఆర్ రూపొందించిన ఎన్నికల మ్యానిఫెస్టో సకలజనుల సంక్షేమానికి వరంలా ఉన్నదని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ విఠల్రావ్, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ డీ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.