హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): నూతన సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన నల్లపోచమ్మ గడిలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. మూడురోజులపాటు శాస్ర్తోక్తంగా జరిగే ఈ క్రతువులో తొలిరోజు రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సతీసమేతంగా గణపతి పూజ నిర్వహించారు. యాగశాల శుద్ధి, గోపూజ, ఆవాహిత గణపతి హోమం, వేద పారాయణం, మహా మంగళహారతి తదితర కార్యక్రమాలు జరిపారు. గురువారం స్థాపితపూజ, ప్రతిష్ఠాపన హోమం, తిరుమంజనం, వేద పారాయణం, మహాలక్ష్మి యాగం, మహా మంగళహారతి తదితర కార్యక్రమాలు ఉంటాయి. శుక్రవారం అన్ని విగ్రహాల ప్రతిష్ఠ, వేదోక్తంగా ప్రాణప్రతిష్ఠ, శిఖర కుంభాభిషేకం, మహా పూర్ణాహుతి, మహా మంగళహారతి తదితర కార్యక్రమాలతో వేడుకలు పూర్తవుతాయి. సచివాలయ ప్రాంగణంలో ఇప్పటికే ఆలయంతోపాటు మసీదు, చర్చిని నిర్మించిన విషయం తెలిసిందే. వీటిని ఈ నెల 25న ధర్మ గురువుల సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.
అద్భుతంగా నిర్మాణాలు
సచివాలయంలో సర్వమత సౌభ్రాతృత్వం పరిఢవిల్లే విధంగా ప్రార్థనా మందిరాలు నిర్మించినట్టు మంత్రి వేముల చెప్పారు. గతంలో కంటే నిర్మాణాలు అద్భుతంగా జరిగాయని, ఆలయంలో శివుడు, నల్లపోచమ్మ, హనుమాన్, గణపతి తదితర మందిరాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ అంటేనే గంగా జమునా తెహజీబ్ అని, సర్వమత సమ్మిళితమని చెప్పారు. అందుకే సీఎం కేసీఆర్ అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తూ, ప్రార్థనా మందిరాలను నిర్మించారని వెల్లడించారు.