హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ వానకాలం సీజన్లో మిగు లు ధాన్యాన్ని కేంద్రం సేకరించకపోతే ఢిల్లీకి తీసుకొచ్చి ఇండియా గేట్ ముందు పోస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. కేంద్రం చేతులెత్తేసినా రైతుల ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని స్పష్టంచేశారు. ఢిల్లీలో శుక్రవారం మంత్రులు నిరంజన్రెడ్డి, గం గుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీ సురేశ్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వానకాలం ధాన్యాన్ని మొత్తం సేకరిస్తామని పార్లమెంట్ లోపల, బయట చెప్పిన కేంద్ర మం త్రులు.. రాతపూర్వక హామీ ఇచ్చేందుకు మాత్రం వెనుకంజ వేస్తున్నారని విమర్శించారు. రెండురోజుల్లో చెప్తానన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయ ల్, మూడు రోజులైనా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అపాయింట్మెంట్ కోరినా ఇవ్వ డం లేదని, ఇది తెలంగాణ రైతులను అవమానించడమేనని మండిపడ్డారు. ఈ విషయం ఇంకా పొడిగిస్తే కేంద్రానికే మంచిది కాదని, త్వరగా నిర్ణయం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్రం ఇచ్చిన 60 లక్షల టన్నుల టార్గెట్ పూర్తయిందని, మిగిలిన ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వడం లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బియ్యం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, గోదాములు లేకపోవడంతో ఎఫ్సీఐ తీసుకోవడం లేదని తెలిపారు. గోదాముల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐకి ఏడు లేఖలు రాసిందని చెప్పారు. ఏపీలోని జగ్గయ్యపేట, కర్ణాటకలోని బీదర్లో ఎఫ్సీఐ గోదాములు ఖాళీగా ఉన్నా, తెలంగాణ బియ్యం అక్కడ నిల్వచేసేందుకు నిరాకరించిందని విమర్శించారు. ఈ నెలలో మిల్లర్లు 6 లక్షల టన్నుల బియ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఎఫ్సీఐ 3 లక్షల టన్నులే తీసుకున్నదని వెల్లడించారు. తప్పు కేంద్రం వద్ద పెట్టుకొని రాష్ట్రంపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీజేపీ రాష్ట్ర నేతలు బండి సంజయ్, కిషన్రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, అసలు వాళ్లు రైతు బిడ్డలేనా? తెలంగాణ బిడ్డలేనా? అని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. కేంద్రం వానకాలం ధాన్యంపై లేఖ ఇచ్చేందుకు సిద్ధమైనా ఆపుతామని సంజయ్, కిషన్రెడ్డి చెప్తున్నారని, రైతులపై మీకున్న ప్రేమ ఇదేనా? అని నిలదీశారు. వాళ్లను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
కేంద్రమంత్రులు తెలంగాణ ప్రజలను, రైతులను అవమానించారని టీఆర్ఎస్ లోక్సభపక్షనేత నామా నాగేశ్వర్రావు విమర్శించారు. తెలంగాణ ఈ దేశంలో అంతర్భాగం కాదా? తెలంగాణ రైతులు దేశ రైతులు కాదా? వీరిపై ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వ చేతగానితనం, అసమర్థత వల్ల దేశంలో వ్యవసాయరంగం తిరోగమనంలో వెళ్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ర్టాలన్నీ కేంద్రం దయా దాక్షిణ్యాలపై నడవాలని భావిస్తున్నారని, ఇది దేశానికి మంచిదికాదని అన్నారు. చట్టసభల్లో ఎంత మెజారిటీ వచ్చిన ప్రభుత్వాలైనా అతి చేస్తే పడిపోక తప్పదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రాష్ర్టాలను, సీఎంలను లెక్కచేయకుండా ఏకవచనంతో మాట్లాడటం కేంద్రంలోని వ్యక్తులకు పరిపాటిగా మారిందని విమర్శించారు. అధికారంలోకి రాకముందు కో-ఆపరేటివ్ ఫెడరలిజం తెస్తామని చెప్పిన మోదీ, ఇప్పుడు సెలెక్టివ్ ఫెడరలిజాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ర్టాలకే కేంద్రం ప్రాధాన్యం ఇస్తున్నదని విమర్శించారు. ఎమ్మెస్పీ, ఎగుమతులు, గోదాములు, రైల్వేలు.. ఇలా అన్నింటినీ కేంద్రం చేతుల్లో పెట్టుకొని ఇప్పుడు చేతులెత్తేయటం చేతగానితనం కాదా? అన్ని ప్రశ్నించారు. మేకిన్ ఇండియాలో పంటల ఎగుమతిని ఎందుకు చేర్చలేదని నిలదీశారు. వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి చాలా ప్రమాదకరంగా ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లను కొనసాగిస్తూ కేంద్రం లేఖ కోసం వేచి చూస్తామని, రైతాంగం అభిప్రాయాలను తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
ధాన్యం సేకరణపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకొనేందుకు వారం నుంచి ఢిల్లీలో ఉన్న రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు తిరిగి హైదరాబాద్ చేరుకొన్నారు. వారంరోజులుగా కేంద్రమంత్రుల చుట్టూ తిరిగినా ఎలాంటి స్పందన లేకపోవటం, శనివారం క్రిస్మస్ సెలవు కావటంతో బృందం తిరిగివచ్చినట్టు సమాచారం. గత శనివారం మంత్రులు నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, పసునూరి దయాకర్, గడ్డం రంజిత్రెడ్డి, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్ నేతకాని బృందం ఢిల్లీకి వెళ్లింది. ధాన్యం వార్షిక సేకరణ, ఈ వానకాలం సీజన్లో మిగులు ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి గోయల్ను కలిసినా ఎలాంటి స్పష్టత రాలేదు. మళ్లీ కలిసి నిలదీద్దామని ప్రయత్నించినా ఆయన కలువకుండా ముఖం చాటేయటంతో రాష్ట్ర బృందం తిరిగివచ్చింది. ఢిల్లీలో జరిగిన పరిణామాలపై సీఎం కేసీఆర్కు వివరించి, తదుపరి కార్యాచరణను రూపొందించే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. సీఎం కేసీఆర్ మంత్రులతో సమావేశం అనంతరం మరోసారి సోమవారం లేదా జనవరి తొలివారంలో ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నట్టు సమాచారం.