నిజామాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్, (నమస్తే తెలంగాణ)/అర్వపల్లి: యువతలో మార్పు మొదలైందని, బీజేపీ పతనం ప్రారంభమైందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం కుకునూర్ గ్రామం నుంచి బీజేపీ కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. స్వచ్ఛందంగా తరలి వచ్చిన యువతను చూసి మంత్రి వేముల మురిసిపోయారు. వారందరికీ మంత్రి వేముల గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. యువతలో భారీ ఎత్తున మార్పు మొదలైందని, బీజేపీ మాయమాటలను, వారి చేష్టలను సహించలేక ఆ పార్టీని వీడి బీఆర్ఎస్కు జై కొడుతున్నారని చెప్పారు.
కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని కండ్లారా చూస్తూ గులాబీ పార్టీకి మద్దతు తెలిపేందుకు యువత భారీగా తరలిరావడం శుభపరిణామంగా అభివర్ణించారు. యువ నాయకుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో రాష్ర్టానికి వేలాది పరిశ్రమలు వచ్చాయని, తద్వారా సుమారు 16 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని వివరించారు. బీజేపీ నేతలు ఓట్ల కోసం ఎంతకైనా తెగిస్తారని, వారి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పసుపు బోర్డు ఇస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి మరీ నిజామాబాద్ రైతులను మోసం చేశారని విమర్శించారు. ఇప్పటి వరకు పసుపు బోర్డు ఊసే లేదని దుయ్యబట్టారు.
ప్రధాని మోదీ వల్ల ఏ ఒక్క వర్గానికీ మేలు చేకూరలేదని తేల్చి చెప్పారు. తన కార్పొరేట్ మిత్రులకు మాత్రం ప్రభుత్వ ఆస్తులను అమ్మి మేలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన, దేశంలో మోదీ పాలనపై ప్రజలు, యువకులు గ్రామాల్లో చర్చ చేయాలని, అప్పుడే వాస్తవాలు బయటికి వస్తాయని సూచించారు. అలాగే.. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ సాగర్ల బుచ్చయ్య, బీఆర్ఎస్ నాయకులు నారబోయిన వెంకన్న, గొడ్ర లక్ష్మీకాంత్, పిట్టల వినోద్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
నిత్యం సోషల్ మీడియాలో ప్రచారం చేసిన అంశాలను చూసి నిజమేనని భ్రమపడ్డాం. దేశం కోసం పని చేస్తున్న బీజేపీ వైపు ఉందామని యువకులం అందరం గతంలో వారి జెండా మోశాం. మా బాల్కొండ నియోజకవర్గంలో కేసీఆర్ సార్, మంత్రి వేములతోనే అభివృద్ధి జరుగుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కాదని.. ఇంకా బీజేపీలో తిరగడం మా అమ్మకు మోసం చేసినట్టే అవుతుంది. అందుకే బీజేపీని వీడి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నాను.
-రంజిత్, కుకునూర్ బీజేపీ కార్యకర్త
కేసీఆర్ మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవు. కేసీఆర్ ప్రధాని అయితే దేశ వ్యాప్తంగా రైతుబంధు, రైతుబీమా, దళితబంధు ఇస్తారు. దేశం అంతటా అభివృద్ధి జరుగుతుంది. వివిధ రాష్ర్టాల ప్రజలు కేసీఆర్కు మద్దతుగా వస్తున్నారు. ఈ మార్పును గమనించే మేమంతా బీఆర్ఎస్ గూటికి చేరుకున్నాం. బీజేపీ చెప్పేదొకటి.. చేసేదొకటి అని అర్థమైంది.
-శరత్, కుకునూర్ యువకుడు