మెండోరా, జూలై 26: రివర్స్ పంపింగ్తో ఎస్సారెస్పీలోకి నీరు వస్తుందా? అని అనేక మంది సందేహాలు వ్యక్తం చేశారని, కానీ సీఎం కేసీఆర్ దాన్ని సాధ్యం చేసి చూపించారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టి నేటికి 60 ఏండ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ప్రాజె క్టు వద్ద నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నా రు. అంతకుముందు మంత్రి పోచంపాడ్ జలవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో దుర్గామాతకు పూజలు చేశారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా నిర్మించిన ముప్కాల్ పంప్హౌస్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. పునరుజ్జీవ పథకం ద్వారా కాళేశ్వర జలాలను శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి తీసుకొచ్చామని, అంతేగాక ఎస్సారెస్పీ ద్వారా 18 లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. 1951లో నాటి హైదరాబాద్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రాంతంలో సాగు నీటి ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదనలు పంపిస్తే.. 12 సంవత్సరాల తర్వాత అప్పటి ప్రధాని నెహ్రూ 1963లో నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందుకు రూ.40 కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎస్సారెస్పీ పూర్తి చేసి 1983లో డ్యాంలో నీటిని నింపినట్టు తెలిపారు. ప్రాజెక్టు మొదటి దశ పూర్తికావడానికి సుమారు 20ఏండ్లు పట్టిందన్నా రు. 2015-16లో పదిలక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే రెండో దశ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని కేసీఆర్ ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారని గుర్తుచేశారు.
త్వరలోనే ప్యాకేజీ 21,22 పనులు పూర్తి..
ప్యాకేజీ 21, 22వ పనులను త్వరలోనే పూర్తి చేసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని గ్రామాలకు కాళేశ్వరం జలాలను అందిస్తామని మంత్రి వేముల తెలిపారు. పునరుజ్జీవ పథకంతో రైతులకు సాగు నీటి భరోసా కలిగిందని అన్నారు. కాళేశ్వర జలాలతో ఇక శ్రీరాంసాగర్ ఎప్పుడూ నిండుకుండలా ఉంటుందని తద్వారా అలీసాగర్, గుత్ప ఎత్తిపోతలు, లక్ష్మి కాలువతోపాటు వేంపల్లి, నవాబు, బోదేపల్లి, చౌట్పల్లి హన్మంత్రెడ్డి ఎత్తిపోతలతో నిజామాబాద్, నిర్మల్, బాల్కొండ రైతాంగానికి సాగే నీరందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జెన్కో ఇంజినీర్లు మంత్రిని సన్మానించారు. జెన్కో ఆవరణలో మొక్క నాటారు. అనంతరం ప్రాజెక్టుపైకి చేరుకొని మాజీ ప్రధాని నెహ్రూ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రాజెక్టు 42 ప్రధాన వరద గేట్లకు స్కాడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిమోట్ గేట్ ఆపరేషన్ సిస్టమ్ను ప్రారంభించి, వరద గేట్లకు ఏర్పాటు చేసిన సీసీ టీవీలను పరిశీలించారు.