నిజామాబాద్ : ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం కోసం సీఎం కేసీఆర్ మదిలో నుంచి పుట్టిన మరో వినూత్న ఆలోచన అర్బన్ ఫారెస్ట్ పార్కు అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
ఈ అర్బన్ ఫారెస్ట్ పార్కు ల ఏర్పాటు వల్ల పట్టణ సమీపంలోని వాసులకే కాకుండా సమీప గ్రామాల ప్రజలకు కూడా ప్రయోజన కరంగా ఉంటుందన్నారు.
మంగళవారం జిల్లాలోని భీంగల్ పట్టణానికి సమీపంలోని లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరలో అర్బన్ ఫారెస్ట్ కోసం మంత్రి స్థలాన్ని పరిశీలించారు. అటవీ అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్థల పరిశీలన ప్రాంతంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..లింబాద్రి గుట్ట దగ్గర ఏర్పాటు చేయనున్న ఈ అర్బన్ పార్కు భీంగల్ పట్టణ వాసులతో పాటు బాచన్ పల్లి, పిప్రి, మెండోర, పల్లికొండ గ్రామాల ప్రజలతో పాటు స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు కూడా సేద తీరేందుకు సౌకర్య వంతంగా ఉంటుందన్నారు.
ఈ పార్క్ లో 5 కి.మీ ల వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్,చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్, లైటింగ్, వాష్ రూమ్స్, చేంజింగ్ రూమ్, వాచ్ టవర్లు, చిట్టడివి, కాంపౌండ్ వాల్ లు ఏర్పాటు చేసేలా రూ.6 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారన్నారు. త్వరలో పార్కు కు సంబంధించిన ప్రపోజల్స్ పై అటవీ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డితో సమావేశమై చర్చిస్తానన్నారు.
అర్బన్ పార్కు తో పాటు సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అడవిని ఆధునిక పద్ధతిలో పునరుద్ధరణ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి సునిల్ ఈరమన్, ఆర్డీవో శ్రీనివాసులు, ఎంపీపీ ఆర్మూర్ మహేష్, జెడ్పీటీసీ రవి, తదితరులు పాల్గొన్నారు.