నిజామాబాద్ : ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ నిర్మాణాలు సీఎం కేసీఆర్ మదిలోంచి పుట్టిన వినూత్న ఆలోచన అని అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో 1.90 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రెసిడెన్షియల్, ఆఫీస్లను ప్రారంభించి మంత్రి దంపతులు సతీసమేతంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
అనంతరం క్యాంపు కార్యాలయం బయట చేపట్టాల్సిన పనులపై ఆర్అండ్బీ అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలకు ఇలాంటి క్యాంపు కార్యాలయాలు లేవని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఏర్పాటు చేశారన్నారు.
గతంలో ఓ కార్యాలయం అనేది లేక.. ప్రజల సమస్యలపై గెస్ట్ హౌస్లలో మీటింగ్ పెట్టుకునే దుస్థితి ఉండేదని, అలాంటి సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని అన్ని సౌకర్యాలతో కూడిన అధునాతన భవనాన్ని నిర్మించామన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఈ క్యాంపు కార్యాలయం నుంచి పరిపాలన మరింత చేరువయ్యి, మంచి సేవలు అందాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, కోటపాటి నర్సింహ నాయుడు, ఆర్డీవో వినోద్, నిజామాబాద్ ఆర్అండ్బీ ఎస్.ఈ రాజేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఆర్డీవో వినోద్, పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.