నిజామాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అందించిన పట్టాలతో పోడు భూముల్లో ఇకపై గిరిజనులు దర్జాగా పంటలు సాగు చేసుకోవచ్చని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎవరికీ భయపడాల్సిన, అణిగిమనిగి ఉండాల్సిన అవసరం లేకుండా భూముల హద్దులతో కూడిన సమగ్ర నక్షాతో ప్రభుత్వం పక్కాగా పట్టా పాస్ బుక్కులు అందిస్తున్నదని తెలిపారు.
బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలం దొమ్మర్ చౌడ్ తండాలో (డీ.సీ తండా) లబ్ధిదారులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం పోడు భూముల పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. అమీర్ నగర్ తండా, సర్పంచ్ తండా, డీ.సీ తండా, కోనాపూర్ కేసి తండా, ఊప్లనాయక్ తండా, సోమిడి తండా, బిల్యానాయక్ తండా, గుడిమల్కాపూర్ తండాలకు చెందిన 190 మంది లబ్ధిదారులకు 590 ఎకరాల పోడు భూమికి సంబంధించిన పట్టా పుస్తకాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పోడు భూముల్లో పంట సాగు చేసుకునేందుకు గిరిజనులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు. వారి బాధలను దూరం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న పట్టాలతో లక్షలాది గిరిజన కుటుంబాలకు పోడు భూములపై యాజమాన్య హక్కులు ఏర్పడ్డాయని హర్షం వెలిబుచ్చారు. తరతరాలకు జీవనోపాధిని అందించే ఈ భూములను అమ్ముకోవద్దని మంత్రి హితవు పలికారు.
పోడు భూముల లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ సీజన్ నుంచే రైతు బంధు, రైతు బీమా పథకాలను వర్తింపచేస్తుందన్నారు. ఇందులో భాగంగా పట్టాల పంపిణీ కంటే ముందే లబ్ధిదారుల ఖాతాలలో రైతుబంధు డబ్బులు జమ చేశామని గుర్తు చేశారు. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా లక్షలాది ఎకరాల పోడు భూములకు హక్కులు పొందినందున ఇకపై అడవుల జోలికి వెళ్లకుండా వాటి సంరక్షణకు అడవి బిడ్డలుగా చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు.
ఇంకా అర్హులు ఎవరికైనా పోడు పట్టాలు రానట్లయితే త్వరలోనే వారికి మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. గిరిజనుల సంక్షేమానికి, తండాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సుపరిపాలన సాగిస్తున్న తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగురావు, ఎంపీపీ గౌతమి, జెడ్పీటీసీ రాధ, మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ బాపురెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుణవీర్ రెడ్డి పాల్గొన్నారు.