నిజామాబాద్ : భారతావని విముక్తి కోసం , ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఛత్రపతి శివాజీ అనుసరించిన విధానాలను స్ఫూరిగా తీసుకున్న సీఎం కేసీఆర్(CM KCR) వాటిని కొనసాగిస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula) అన్నారు. శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ముప్కాల్ మండల కేంద్రంలో లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన, వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో ఛత్రపతి శివాజీ (Shivaji)మహారాజ్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని మాట్లాడారు.
అఖండ భారతమే ధ్యేయంగా 10 మంది సైనికులతో బయలుదేరిన ఛత్రపతి శివాజీ చరిత్ర పుటల్లో నిలిచిపోయారని కొనియాడారు. శివాజీ స్ఫూర్తితో ఒక్కడే ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రం సాధించిన దార్శనిక నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు. తెలంగాణలో నేడు పుష్కలంగా సాగు నీరు, కరెంట్, పాడి పంటలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని వెల్లడించారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల వస్తున్న మార్పు పై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని కోరారు. అనంతరం మంత్రి వివిధ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి వెంట పలువురు అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.