నిజామాబాద్ : బాల్కొండను సీఎం కేసీఆర్9CM KCR) బంగారు తునక చేశారు. కాళేశ్వరం జలాలతో జిల్లాలను సస్యశ్యామలం చేశారు. మిషన్ కాకతీయ పథకంలో జిల్లాలోని చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. రూ.వెయ్యి కోట్లతో బాల్కొండ నియోజకవర్గంలో రోడ్లను అద్దంలా చేసుకున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula) అన్నారు. గురువారం బాల్కొండలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. బాల్కొండలో పదిహేను వందల డబుల్ బెడ్ రూం ఇండ్లు నర్మించామని మరిన్ని డబుల్ బెడ్ రూం, గృహలక్ష్మి ఇండ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మరో మూడు చోట్ల సబ్స్టేషన్లు కేటాయించాలన్నారు. కొత్తగా బీడీలు చేసే వారికి పింఛన్ ఇప్పించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
వేల్పూర్లో జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలని, భీంగల్ నింబాచల లక్ష్మీనరసింహాస్వామి దేవాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పారెస్పీ ప్రాజెక్ట్ చుట్టుపక్కల పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్నారు. బాల్కొండ నియోజకవర్గాన్ని బంగారు తునక చేసిన సీఎం కేసీఆర్కు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.