హైదరాబాద్, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన రూ. 500కే గ్యాస్ సిలిండర్పై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పథకం అమలు విధివిధానాలపై పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శుక్రవారం సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్ని గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి? పట్టణాల్లో ఉన్నవెన్ని? పల్లెల్లో ఎన్ని ఉన్నాయి? ప్రతినెలా రీఫిల్ బుక్ చేసుకుంటున్నవారు ఎంతమంది? పథకం అమలు చేస్తే ప్రభుత్వంపై పడే ఆర్థికభారం ఎంత? అన్న అంశాలపై మంత్రి ఆరా తీశారు. వీటిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశం కావాలని మంత్రి భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆ తర్వాతే రూ. 500కే గ్యాస్ సిలిండర్పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పౌరసరఫరాలశాఖపై నిర్వహించిన తొలి సమీక్షలో మంత్రి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంలో భాగంగా అందించే రూ. 500 గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తే ప్రభుత్వంపై ప్రతి ఏటా రూ. 3వేల నుంచి రూ.4వేల కోట్ల భారం పడే అవకాశం ఉన్నదని తెలిపారు. సమీక్షలో పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్కుమార్ పాల్గొన్నారు.