హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): సివిల్ సప్లయీస్ శాఖలో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని, ఇందులో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పాత్ర ఉన్నదని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. ఈ స్కామ్కు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఈ అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, దీనిపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన చిట్చాట్లో ఏలేటి మాట్లాడారు. పబ్లిసిటీ కోసమే వ్యాఖ్యలు చేస్తున్నారని తనపై వచ్చిన విమర్శలను ఖండించారు. చర్చకు తాను ఒక్కడినే వస్తానని, ఎంతమంది వచ్చినా తాను అడిగే ప్రశ్నలకు ఉత్తమ్ సమాధానమివ్వాలని సవాల్ చేశారు.