హైదరాబాద్, జనవరి13 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు కింద మొత్తంగా 18 లక్షల స్థిరీకరణ ఆయకట్టు ఉన్నదని, అయితే ఈ ఏడాది బరాజ్లలో నీటినిల్వలు లేకపోవటంతో పంటలకు పూర్తిస్థాయిలో నీరివ్వలేకపోతున్నామని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. స్థిరీకరణ ఆయకట్టులో ఈ యాసంగి సగానికిపైగా తగ్గే అవకాశమున్నదని చెప్పారు. నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులతో ఎర్రమంజిల్లోని జలసౌధలో శనివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఎస్సారెస్పీ స్టేజ్-2తో కలిపి మొత్తంగా 18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నదని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ఏడాది అందుబాటులో లేకుండాపోయిందని ఆరోపించారు. ప్రస్తుతం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో నీటి నిల్వలు అడుగంటాయని తెలిపారు. ఈ నేపథ్యంలో స్థిరీకరణ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరివ్వలేకపోతున్నామని పేర్కొన్నారు. రైతులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరారు.
ఏడాది చివరి నాటికి దాదాపు 5 లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టును సృష్టించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. కొత్త ఆయకట్టును వేగంగా ఏర్పాటు చేయగల ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తామని, 6 నెలలు, సంవత్సరంలోపు కొత్త ఆయకట్టును సృష్టించగల ప్రాజెక్టులను గుర్తించామని చెప్పారు. ఆ లక్ష్యాన్ని సాధించే ప్రాజెక్టులపై ఖర్చును పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. డిసెంబర్ 2024 నాటికి 4.5 నుంచి 5 లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టులను సృష్టించడం తమ లక్ష్యమని చెప్పారు. అంబేదర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఉత్తమ్ కుమార్రెడ్డి పునరుద్ఘాటించారు.
ప్రస్తుతం కృష్ణాబేసిన్లో తీవ్ర నీటి కొరత ఉన్నదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచన మేరకు కోయినా నుంచి నీరివ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. నీటికి బదులుగా ఆ మేరకు కరెంటిస్తామని హామీ ఇస్తున్నామని చెప్పారు. కొయినా నుంచి మొత్తంగా 100 టీఎంసీల నీటిని అడగాలని భావిస్తున్నట్టు చెప్పారు. తాగునీటి అవసరాలు తీర్చడానికి ఆల్మట్టి నుంచి 10 టీఎంసీల నీటిని ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా కోరనున్నామని వెల్లడించారు. కృష్ణా నీటిని కోరేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కర్ణాటకలో పర్యటించనున్నదని వివరించారు.