Uttam Kumar Reddy | కాళేశ్వరం అందుబాటులో లేకపోవడంతో ఎస్సారెస్పీ స్టేజ్ 2 నీళ్లు ఇవ్వలేకపోతున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర నీటి పారుదల ప్రాజెక్టులు, నీటి విడుదల అంశాలపై జలసౌధలో ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించే ప్రాజెక్టుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఏడాది చివర నాటికి కొత్తగా 4.5 నుంచి ఐదు లక్షల ఎకరాలకు నీరందించే విదంగా ప్రాజెక్టుల పనులు వేగవంతం చేస్తున్నట్టు అధికారులు వివరించారు.
ఇపుడు అవసరమైన నిధులు వ్యయం చేసి కొత్త ఆయకట్టు సృష్టించాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. కొత్తగా ప్రాజెక్టులలో నీరందించే విషయంలో అడ్డంకులన్నీ అధిగమించి సకాలంలో నీరందించాలని సూచించారు. రాబోయే జూన్ నాటికి కొత్త ఆయకట్టు ఇచ్చే ప్రాజెక్టులు, ఏడాది చివర నాటికి కొత్త ఆయకట్టు ఇచ్చే ప్రాజెక్టులపై పనులు వేగవంతం చేయాలని సూచించారు. కృష్ణా, గోదావరి బేసిన్ లలో సుమారు 18 ప్రాజెక్టులలో పలు ప్యాకేజీల కింద ఈ ఏడాది చివర నాటికి నీరందిస్తామన్నారు. రాబోయే ఐదేండ్లలో ఏ ప్రాజెక్టులలో కొత్త ఆయకట్టు ఎంత ఇస్తున్నామో సమాచారం సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. కొత్త ఆయకట్టుకు నీరు ఇచ్చే విషయంలో ఉన్న ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త ఆయకట్టుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు.
చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంథని నియోజకవర్గానికి నీరందించే పనులు చేపట్టాలని మంత్రి సూచించారు. రాబోయే వేసవి కాలంలో రాష్ట్రంలో చెరువుల పూడిక కార్యక్రమాలు, జంగిల్ కటింగ్ చేపట్టాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి వర్షాకాలంలోపు అన్ని చెరువుల పనులు పూర్తి చేయాలన్నారు. ఐడీసీ పరిధిలోని అన్ని చిన్న ఎత్తిపోతల పథకాలు పూర్తిస్థాయిలో పని చేసే విధంగా చర్యలు చేపట్టాన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు కోయినా ప్రాజెక్టు నుంచి వంద టీఎంసీల నీరు మనకు ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. మహారాష్ట్రకు ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే విద్యుత్ ఉత్పత్తికి సంబందించిన వ్యయం అందిస్తామని సూచించామని తెలిపారు.