హైదరాబాద్, ఫిబ్రవరి1 (నమస్తే తెలంగాణ) : ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనుల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. సొరంగ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన నిర్వహించిన హెలి-బోర్న్ సర్వే నివేదిక సైతం ప్రభుత్వానికి చేరిందని వెల్లడించారు. ఎస్ఎల్బీసీ, కాళేశ్వరం బరాజ్ల పునరుద్ధరణ పనులపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఆదివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులు పూర్తి చేసేందుకు నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో నిర్వహించిన ఏరియల్ ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వే నివేదిక ప్రభుత్వానికి చేరిందని వివరించారు. సొరంగ మార్గంలోని పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక జియో టెక్నికల్, జియాలజికల్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కాళేశ్వరం బరాజ్ల పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని, పరస్పరం సమన్వయం చేసుకుంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నుంచి డిజైన్లకు దశలవారీగా అనుమతులు పొందడం సులువు అవుతుందని ఉత్తమ్ తెలిపారు.