ఖమ్మం, జనవరి 4 : అభయహస్తం కింద అమలు చేసే ఆరు గ్యారెంటీ పథకాల(Government schemes) ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala) సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం గ్యారెంటీ హామీలన్నింటినీ అమలు చేస్తుందని స్పష్టం చేశారు. వీటి ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చుతుందని అన్నారు. ఖమ్మం నగరంలో గురువారం పర్యటించిన ఆయన.. 49వ డివిజన్లో నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం కార్యక్రమం కింద ఐదు గ్యారెంటీల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. గత నెల 28న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల 6 వరకు జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాలు, అన్ని మున్సిపల్ వార్డుల్లోనూ నిర్ణీత తేదీల్లో కొనసాగుతుందని అన్నారు. అయితే ప్రజాపాలన గ్రామసభ రోజున దరఖాస్తు అందించలేని ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఏసీపీ హరికృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.