Tummala Nageswara Rao | ఖమ్మం, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇక నుంచి పంట వేసిన వారికే పెట్టుబడి సాయం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ప్రజల నుంచి ఇలాంటి విజ్ఞప్తులే వస్తున్నాయని, శాసనసభలో చర్చించి విధివిధానాలు రూపొందిస్తామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం సన్నాయిగూడెంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 64.77 లక్షల మంది రైతులకు రూ.5,574.77 కోట్ల రైతుబంధు సాయాన్ని జమ చేశామని వివరించారు.
రాష్ట్రంలో 92 శాతం మంది రైతులు 5 ఎకరాల్లోపు వారే ఉన్నారని, వారికి ఇప్పటికే రైతుబంధు అందిందని అన్నారు. మరో 4 లక్షల మందికి ఈ నెలాఖరులోగా అందిస్తామని అన్నారు. రైతుల రుణమాఫీపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని, విధివిధానాలపై బ్యాంకర్లతో సమాలోచనలు జరుపుతున్నామని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను వైరా రిజర్వాయర్కు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. తాగునీటి అవసరాల కోసం పాలేరు రిజర్వాయర్కు రెండు రోజుల్లో సాగర్జలాలు వస్తాయని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో చర్చించామని అన్నారు.