హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ధరల స్థిరీకరణ పథకం ద్వారా రాష్ట్రంలో పండించిన కందులను జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ సమాఖ్య( నాఫెడ్) ద్వారా కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నాఫెడ్ ద్వారా 10 లక్షల టన్నుల కందులు సేకరించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో మార్క్ఫెడ్ను నోడల్ ఏజెన్సీగా ఎంపిక చేసింది. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా వ్యవసాయ మార్కెట్లు, పీఏసీఎస్లు, డీసీఎంఎస్లు, ఎఫ్పీవోల ద్వారా 50వేల టన్నుల కందుల సేకరణకు రాష్ట్రప్రభుత్వం తెలంగాణ మార్క్ఫెడ్ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. గురువారం నుంచే కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
మిర్చికి మద్దతు ధర లభించకుంటే సరుకును మార్కెటింగ్ కోల్డ్ స్టోరేజీల్లో నిల్వచేసుకునే అవకాశాలను పరిశీలించాలని మంత్రి తుమ్మల సూచించారు. నిల్వ చేసుకున్న సరుకుపై మార్కెటింగ్శాఖ అమలు చేస్తున్న రూ. 2లక్షల రైతుబంధు పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.