చేర్యాల, మార్చి 12: త్వరలో జరుగనున్న కర్ణాటక ఎన్నికల నుంచే దేశంలో బీజేపీ పతనం ప్రారంభమవుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జోస్యం చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ సర్కారుపై కక్ష సాధింపులో భాగంగా కవితపై ఈడీ విచారణ ప్రారంభించిందని, ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే కవిత మొక్కవోని ధైర్యంతో 9 గంటల పాటు ఈడీ విచారణ ఎదుర్కొని నిర్భయంగా బయటకు వచ్చారని అన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామిని ఆదివారం ఆయన దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు.
అనంతరం ఆలయ గెస్ట్హౌస్లో మీడియాతో మాట్లాడుతూ ఈడీ, సీబీఐ, ఐటీ వంటి ప్రభుత్వ సంస్థలను బీజేపీ తమ ఏజెంట్లుగా మార్చుకొని ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకొన్నదని విమర్శించారు. కవితపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని, ఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన కుటుంబ సభ్యులే సహించడం లేదని మండిపడ్డారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో వందకుపైగా సీట్లలో విజయం సాధించి బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. దమ్ముంటే అభివృద్ధిలో బీజేపీ నాయకులు పోటీ పడాలని, కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి రూ.100 కోట్లు తెచ్చి అభివృద్ధి చేసి చూపించాలని సవాల్ విసిరారు. వేల కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లిన వారిపై బీజేపీ సర్కారు ఏం చర్యలు తీసుకున్నదని, ప్రపంచవ్యాప్తంగా దేశప్రతిష్టను దిగజార్చిన అదానీ సంగతి ఏమిటని మంత్రి తలసాని ప్రశ్నించారు. మహారాష్ట్ర సర్కాను పడగొట్టి వారి చెంచాలను అధికార పీఠంపై కూర్చోబెట్ట్టేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఎక్కడి నుంచి ఇచ్చారని, వాటి గురించి ఈడీ ఎందుకు విచారణ చేపట్టదని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న బీజేపీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.